మెదక్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టవలసినదిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. శనివారం తన ఛాంబర్లో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో కలిసి అందోల్ నియోజకవర్గంలో రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ద్వారా వివిధ పథకాల కింద చేపట్టిన బీటీ, రెన్యువల్స్ పై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భగా మాట్లాడుతూ రోడ్లు భవనాలు శాఖ ద్వారా 2021-22, 2022-23 సంవత్సరంలో 32 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు పునరుద్ధరణకు 8 పనులు మంజూరు కాగా, కేవలం ఒక పనికి మాత్రమే టెండర్ వచ్చిందని, మిగతా వాటికి కూడా టెండర్లు మరోమారు ఆహ్వానించి పనులు మొదలు పెట్టేలా చూడాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ రహదారుల నిర్వహణ, వరద నష్ట ఉపశమనం, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 28 పనులకు సంబంధించి ఇంతవరకు టెండర్ రాని వాటికి మరోమారు టెండర్లు ఆహ్వానించి, వెంటనే పనులు చేపట్టేందుకు చొరవ చూపాలని పంచాయత్ రాజ్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఇన్చార్జి ఈఈ సురేశ్, డిప్యూటీ ఈఈ వెంకటేశం, పంచాయతీ రాజ్ ఈఈ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.