Revanth Reddy | వ్యవసాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24గంటల ఉచిత కరెంట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలపై జిల్లా రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కనీసం అవగాహన లేకుండా రేవంత్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నాడని రైతులు విమర్శిస్తున్నారు. ముందు వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో కొత్త పల్లవి అందుకున్నారు. ప్రస్తుత వ్యవసాయ రంగంలో సాధ్యమే కానీ 10 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటర్లు వాడితే మూడు గంటలు చాలదా అని మరో ట్విస్టును ఆయన ముందుకు తెచ్చారు. మూడు గంటల కరెంట్ ఎలా సరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు 10హెచ్పీ మోటర్ల భారం ఎలా భరిస్తారని నిలదీస్తున్నారు. సమైక్య పాలనలో అరకొర కరెంట్తో ఇక్కట్లు పడ్డ ప్రజలకు ఇవాళ ఆ ఇబ్బందులు తొలిగాయి. కేసీఆర్ విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలతో నాణ్యమైన కరెంట్ అందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో స్వరాష్ట్రంలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. మెదక్ జిల్లాలో 1.10 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
సిద్దిపేట, నవంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కరెంట్ పై ప్రత్యేక దృష్టి సారించి విద్యుత్ కష్టాలు తీర్చారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ను అందిస్తున్నారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇవ్వడంతో రైతులు ఖుషీ ఖుషీగా పంటలు పండిస్తున్నారు. రాత్రి పూట బావుల కాడికి పోవుడు తప్పింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ తొమ్మిదేండ్లలో విద్యుత్ రంగంలో సమూల మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో ఒక విద్యుత్ మీదనే రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,104.08 కోట్లు ఖర్చు చేసింది. జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 5,51,427 ఉండగా వీటిలో 3,34,171 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. దీంతో డిమాండ్కు తగ్గ కరెంట్ను ప్రభుత్వం అందిస్తుంది. సీఎం కేసీఆర్ విజన్తో జిల్లా వ్యాప్తంగా నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుంది. సమైక్యపాలనలో అరకొర కరెంట్తో ఇక్కట్లు పడ్డ ప్రజలు,రైతాంగం ఇవాళ ఆ ఇబ్బందులు తొలిగిపోయాయి. దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే నిరంతరాయంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఏ రంగం వారు కూడా ఇబ్బంది పడడం లేదు.
రైతాంగానికి ఎంతచేసినా తకువేనని. అందుకే వ్యవసాయానికి 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమించారు. దీనిని సాధించేందుకు విద్యుత్రంగ కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు కృషి చేశారు. వ్యవసాయ రంగంతో పాటు జిల్లాలోని ప్రతి రంగానికి 24 గంటలపాటు నిరంత రాయంగా విద్యుత్ను అందించేందుకు వీలుగా కోట రూపాయలతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేశారు.ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను గణనీయంగా పెంచారు. వ్యవసాయానికి 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్లో భాగంగా పైలట్ ప్రాజెక్టును 2017 జూలై 18 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ను అందించి, సమస్యలను పరిషరించారు. 2018 జనవరి 1 నుంచి నిరంతరాయంగా 24 గంటల విద్యుత్ను పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. ఇది దేశంలోనే రికార్డు. 2016 ఏప్రిల్ 1 నుంచి 9 గంటల ఉచిత విద్యుత్ను, 2018 జనవరి 1 నుంచి 24 గంటలు ఉచిత, నాణ్యమైన విద్యుత్ను తెలంగాణ సరారు అందిస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ఇందు కోసం ఏటా వేల కోట్లు భరిస్తున్నది.
జిల్లా ఏర్పాటైన తర్వాత సిద్దిపేటలో ఎస్ఈ కార్యాలయ ఏర్పాటుతో విద్యుత్ వ్యవస్థ బలోపేతమైంది. సర్కిల్ కార్యాలయం ద్వారా లోడ్ మానిటరింగ్, టెక్నికల్ డీఈలు, సివిల్ డీఈలు అందుబాటులో ఉంటున్నారు. విద్యుత్ పనులు, మరమ్మతులు త్వరగా పూర్తవుతున్నాయి. వ్యవసాయ కనెక్షన్లు, గృహ అవసరాల కనెక్షన్లు, పరిశ్రమల కనెక్షన్లు, నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు సంబంధించి అనుమతులు వేగంగా ఇస్తున్నారు.జిల్లా అవసరాల కోసం మంత్రి హరీశ్రావు సిద్దిపేట పట్టణంలో విద్యుత్ పరికరాల స్టోర్ను అందుబాటులోకి తెచ్చారు. దుబ్బాక, హుస్నాబాద్లో విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు, విద్యుత్ పరికరాలు, అందుబాటులో ఉంటున్నాయి. గతంలో సంగారెడ్డికి వెళ్లి విద్యుత్ పరికరాలు తెచ్చుకోవాల్సి ఉండడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఇప్పుడు జిల్లాలో ఏగ్రామంలోఎంతటి విద్యుత్ సమస్య వచ్చినా కావాల్సిన పరికరాలు, టెక్నికల్ స్టాఫ్ వేగంగా పరిష్కరిస్తున్నారు.
మిరుదొడ్డి, నవంబర్ 19: మూడు గంటల కరెంట్ ఇస్తే ఎవుసం ఎట్ల జేస్తం. 50 ఏండ్లు కాంగ్రెసోళ్లు ఏలినప్పుడు ఎంత కరెంట్ ఇచ్చిండ్రు, అప్పుడు కరెంట్ సక్కగా ఇస్తే మా బతుకులు గిట్ల ఎందుకు అయ్యేది. కాంగ్రెసోళ్ల వల్లనే రైతుల చేతుల్లో పైసలు లేక బక్కపడ్డం. సీఎం కేసీఆర్ సారు వచ్చినంకనే గీ పదేండ్ల నుంచి ఎవుసానికి, ఇండ్లకు 24 గంటల పాటు కరెంట్ వస్తుంది. ఎవుసం జేసుకుంటా జెర్ర రైతులు మంచిగైతుంటే గిప్పుడు కాంగ్రెసోళ్లు కరెంట్ కట్ జేసి 3 గంటలు ఇత్తమంటున్నారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే రైతులకు 24 గంటల కరెంట్ ఇయ్యరు. రైతులను మంచిగా సూసే సీఎం కేసీఆర్ సారే మళ్లీ గెలిచి రావాలని ఆ దేవుడిని మొక్కుతున్నా.
హుస్నాబాద్టౌన్, నవంబర్ 19: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రైతులను పరేషాన్చేస్తుండు.ఆనాడు నాత్రిపూట కరెంట్ వల్ల చాలా బాధపడ్డం. పాములు, తేళ్లు కరిచి రైతులు చనిపోయారు. కరెంట్ సక్కగ రాక పొలం పారకపోయేది. బాయికాడికి పోతే రాత్రి సమయంలో పురుగు కుట్టింది… తెల్లందాక గోసపడ్డం. దవాఖానకు వెళ్లే రూ.10 వేల వరకు ఖర్చయాయి. పొలం ఎండిపోయింది… ఇదీ హుస్నాబాద్ మండలం మాలపల్లికి చెందిన గొల్లపల్లి నర్సయ్య అనే రైతు కరెంట్ తీరుపై ఆ రోజుల్లో పడిన కష్టాన్ని… నేడు వస్తున్న కరెంట్ విషయాన్ని వివరించాడు. రేవంత్రెడ్డికి ఎవుసం తెల్వదు.. కేసీఆర్ ఎవుసం చేసినోడు కాబట్టే రైతులకు బాధలు లేకుండా చేశాడు.
మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 19: రేవంత్రెడ్డి చెప్పే ముచ్చటకు ఎవుసం బంద్ చేయాల్సిందే.. నేను పదిహేనేండ్ల నుంచి గ్రామంలోనే మోటర్ మెకానిక్గా పనిచేస్తున్నా. మూడు గంటల విద్యుత్ వస్తే మొత్తానికే వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. 24గంటల కరెంట్ ఉంటేనే సాధారణ రైతుకు రెండు ఎకరాల పొలం పారుతుంది. మూడు గంటల కరెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే మూడు గంటల కరెంట్ అంటే నారుమడి కూడా పారదు. ఇట్లయితే రైతులు ఎవుసం బంద్ పెట్టుకొని కూలిపనులకు వెళ్లాల్సిందే.. రేవంత్రెడ్డికి ఏం ఎరుక అని గీ ముచ్చట చెబుతుండో నాకు అర్థం కావడం లేదు.
సిద్దిపేట జిల్లాలో 2022-23లో ఇప్పటి వరకు 1732 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 2,657 కి.మీటర్ల వైరు, 31,906 విద్యుత్ స్తంభాలను బిగించారు. దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల విద్యుద్దీరణలో భాగంగా 482 కొత్తగా 25కేవీఏ 1పీహెచ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశారు. బీపీఎల్ కింద 30,227 ఇంటి సర్వీసు కనెక్షన్లను ఒక్కో దానికి రూ. 125 కే అందించారు. ఇంటిగ్రేటేడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం కింద సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ పట్టణాల్లో 243 కొత్త 100 కేవీఏ, 26 కొత్త 160 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 82 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 160, 250, 315 ఏవీఏ సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఇందుకు 1028 హెచ్టీ స్తంభాలు, 2432 ఎల్టీ స్తంభాలు, ఏర్పాటు చేశారు. 41.12 కి.మీటర్ల హెచ్టీ లైన్, 97.5 కి.మీటర్ల ఎల్టీ లైన్ను కొత్తగా ఏర్పాటు చేశారు. దీనికి ప్రభుత్వం రూ. 26.90 కోట్లు ఖర్చు చేసింది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 3,750 శిథిలావస్థకు చేరిన స్తంభాలు, పాతవి, తుప్పుపట్టిన 1358 స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. 10,926 లూస్ లైన్స్, 6,613 మిడిల్ స్తంభాలు, 2,760 వంగిన స్తంభాలు సరిచేశారు. ఇందుకు ప్రభుత్వం రూ. 6.8 కోట్లు ఖర్చు చేసింది.
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ. 3.2 కోట్లతో1344 లూస్ లైన్స్ స్తంభాలు, 1029 మిడిల్ స్తంభాలను ఏర్పాటు చేశారు. 924 శిథిలావస్థలో ఉన్న, 656 తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త వాటిని బిగించారు. 526 వంగిన స్తంభాలను సరిచేయడం, 999 స్తంభాల స్ట్రీట్ లైట్ వైరు, 83 కొత్త స్ట్రీట్ లైట్ మీటర్ల ఏర్పాటు చేశారు. లోవోల్జేజీ, అధిక లోడ్ను అధిగమించడానికి కొత్తగా 32 కి.మీటర్ల 33 కేవీ లైన్, 5 అదనపు సబ్స్టేషన్ల టాన్స్ఫార్మర్లను, 175 డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లను రూ. 10కోట్లతో ఏర్పాటు చేశారు. రజకులకు, నాయీబ్రహ్మణులకు కొత్తగా ఒక్కొక్కరికి రూ. ఎనిమిది వేలు ఖర్చు చేసి విద్యుత్ మీటర్లు, విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేసి 3,300 సర్వీస్ కనెక్షన్లు ఇచ్చింది. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నాలుగు 33/11 కేవీ ఉపకేంద్రాలను బండమైలారం, బండతిమ్మాపూర్, తునికిబొల్లారం, మందపల్లి గ్రామాలకు మంజూరు చేశారు. కొత్త కాలనీలకు సిద్దిపేట కేసీఆర్ నగర్, గజ్వేల్ ఆర్ఆర్కాలనీ, ముట్రాజ్పల్లిలో 33/11 కేవీ సబ్స్టేషన్లు ఇచ్చారు. ఈ రకంగా జిల్లాలో విద్యుత్ వ్యవస్థను పటిష్టపర్చడంతో ఎలాంటి అటంకం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుంది.
సిర్గాపూర్, నవంబర్ 17: మన దగ్గర నీటి వనరులు చాలా లోతులో ఉంటాయి. నీటి ఊటలు చాలా తక్కువగా ఉంటాయి. దాంతో 3, 5 హెచ్పీ మోటార్లు మాత్రమే రైతులు వినియోగిస్తారు. 10 హెచ్పీ మోటార్ ద్వారా పంపింగ్ చేయాలంటే నీటి ఊటలు సరిపడవు. అంతే కాదు 10 హెచ్పీ మోటారు అందరూ బిగిస్తే కరెంటు లోడు ఎక్కువై దగ్గరలోని లిమిటెడ్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. పెద్ద ఖర్చుతో కూడిన అంత పెద్ద మోటర్ ఏ రైతు కూడా వాడరు. నా వద్దకు 3, 5 హెచ్పీ సామర్థ్యం ఉన్న మోటార్లే రిపేర్ కోసం వస్తాయి. అంత పెద్ద మోటారు చిన్నకారు రైతులు తెచ్చుకునేందుకు సాధ్యం కాదు.
కాంగ్రెస్సోల్లవన్ని ఝూట మాటలే. రైతులకు 3గంటల కరెంట్ చాలని రేవంత్రెడ్డి చిల్లరగా మాట్లాడటం సరికాదు. 10 హెచ్పీ మోటర్తో 3గంటల్లో పొలానికి నీరు పారించుకోవచ్చని చెప్పడం అవివేకమే. రేవంత్రెడ్డికి వ్యవసాయం చేస్తే తెలుస్తుంది ఎన్ని గంటల్లో ఎన్ని ఎకరాలు పారుతుందని. 10 హెచ్పీ మోటర్లు వ్యవసాయానికి వాడుతారో లేదో కూడా తెలియని పరిస్థితి వారిది. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం చానా గోసవడ్డం. అర్ధరాత్రి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టేవాడిని. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే 24గంటల మంచి కరెంట్ అస్తున్నది.
కొల్చారం, నవంబర్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు కరెంటు ఇచ్చేటోళ్లు. దీంతో బోరు మోటర్ల వద్ద పడికాపులు కాసేది. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక కరెంట్ మంచిగిస్తున్నరు. కాంగ్రెసోళ్లు 3గంటల కరెంటు , 10 హెచ్పీ మోటర్ అంటున్నరు. కాంగ్రెసోళ్లు మా రైతులను మళ్లీ ఆగంజేస్తరేంది.
వ్యవసాయంపై కాంగ్రెస్ లీడర్లకు అవగాహన లేనట్లుగా మాట్లాడుతున్నాడు. 10హెచ్పీ మోటర్లతో నీటిని గుంజితే భూగర్భజలాలు ఎండిపోవడం ఖాయం. 3, 5హెచ్పీ మోటర్లను బోర్లకు వాడుకుంటాం. 24గంటల ఉచిత విద్యుత్తో ప్రస్తుతం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు.రేవంత్రెడ్డి మాత్రం 3గంటలు కరెంట్ సరఫరా ఇచ్చి 10 హెచ్పీ మోటర్లతో నీటిని పంటలకు వదలాలని సూచిస్తుండడం విడ్డూరం. బీఆర్ఎస్ సర్కారులో కరెంట్ మంచిగా వస్తున్నది.
ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఇస్తున్న 24గంటల కరెంట్తో మంచిగ పంటలు పండించుకుంటున్నం. గతంల కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ మంచిగి ఇయ్యకుండే. ఇప్పుడు కాంగ్రెసోళ్లు 3గంటల కరెంట్ చాలంటున్నరు. 10 హెచ్పీ మోటర్తో రెండు, మూడుగంటల్లోనే పొలాన్ని తడపచ్చని అంటున్నారు. ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే వ్యవసాయబోర్లకు కేవల 3లేదా 5హెచ్పీ మోటర్లనే బిగించుకుంటరు. 10హెచ్పీ మోటర్లతో నీటిని గుంజితే ఒక్కసారిగా బోర్లల్లో నీళ్లు ఇంకిపోయే ప్రమాదం ఉంది. 10హెచ్సీ మోటరు విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.70 వేల నుంచి లక్షవరకు ఉన్నది. ఇది రైతులతో సాధ్యమయ్యే పనికాదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా రైతులకు మళ్లీ కష్టాలు తప్పవు.
సిద్దిపేట జిల్లాలో విద్యుత్ ప్రగతి.. నాటి నేటి పరిస్థితులు ఇలా…తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ తొమ్మిదేండ్ల కాలంలో
విద్యుత్ సమూల మార్పులు వచ్చాయి. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో ఒక విద్యుత్ మీదనే రూ.4,104.08 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది.
‘ఘడియ ఘడియకి కరెంట్ కోతలు.. వచ్చిపోయే కరెంట్తో పారిన మడే పారుతుండే.. లోవోల్టేజీతో తరుచూ మోటర్లు కాలుడు.. తెగిపడిపోయిన విద్యుత్ వైర్లతో రైతులు పిట్టల్లా రాలిపోయారు. కరెంట్ కష్టాలు అన్ని ఇన్ని కావు.. తెగిపడిపోయిన విద్యుత్ వైర్లు, ఎండిపోయిన పొలాలు, రాలిపోయిన జీవితాలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు.. ఇది నాటి కరెంట్ పరిస్థితి.”
“సీఎం కేసీఆర్ రైతు బిడ్డ.. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. ఇవాళ కరెంట్ కష్టాలు లేవు.. రాత్రిపూట పాముకాట్లు లేవు. తెగిపడిన విద్యుత్ వైర్లు లేవు..రైతులకు కావాల్సిన కరెంట్ను ఉచితంగా ఇస్తున్నారు. బిస్కట్ల లాగ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. నాణ్యమైన కరెంట్ కోసం విరివిరిగా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. కావాల్సినంత కరెంట్.. పండించుకున్నన్ని పంటలు.. విద్యుత్ వినియోగంలో రికార్డులు..ఇలా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. నాడు కరెంట్ ఉంటే వార్త..
మెదక్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని ఊకదంపుడు ప్రకటనలు చేస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదు.. 3 గంటలు చాలు అంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు చూస్తే గతంలోని కష్టాలు మళ్లీ చూడాల్సి వస్తుందేమోనని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో బోర్లు, బావుల్లో నీరు ఉన్నా సాగుకు నోచుకోని పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. రాత్రి సమయాల్లో దీపాలు పట్టుకుని బోర్ల వద్దకెళ్లి కరెంట్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రాగానే 3 గంటల కరెంట్ ఇస్తామని రైతులను మోసం చేయాలని చూస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే కష్టాలు తప్పవని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఇచ్చి రైతన్నలను ఆదుకున్నది. రైతులు పొలాల వద్దకు వెళ్లి సంతోషంగా పంటలు పండించుకుంటున్నారు. వ్యవసాయంతో పాటు పరిశ్రమలు, గృహాలకు నిరంతరంగా విద్యుత్ అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు వద్దు.. 3 గంటల కరెంటు చాలు అని ఉపన్యాసాలు ఇచ్చారు. 24 గంటలలో 3 గంటల కరెంటు ఎప్పుడిస్తారో అసలు రేవంత్రెడ్డికే క్లారిటీ లేదని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 హెచ్పీ మోటర్లతో 3 గంటల్లో మూడెకరాలకు నీళ్లు పెట్టొచ్చన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలకు అంతులేదని జిల్లా రైతాంగం మండిపడుతున్నది. మూడు గంటల కరెంటుతో మళ్లీ కరెంటు షాక్లతో రైతులు ఆత్మహత్యలు తప్పవని చెబుతున్నారు. రాత్రిపూట పొలాలకు వెళితే జరిగే ఘటనలు పునరావృతం అవుతాయంటున్నారు.
ఏ రైతు కూడా 10 హెచ్పీ మోటర్లు వాడే పరిస్థితి లేదు. ఈ మోటరు పెడితే దాని ఖర్చు రైతు తట్టుకోలేడు. 5 హెచ్పీ, 6 హెచ్పీ, 7హెచ్పీ మోటర్ల వరకు రైతులు వాడుతారు. 10 హెచ్పీ అవసరం లేదు. 600 ఫీట్ల లోతులో నీళ్లు ఉంటే ఈ మోటర్ అవసరం. 10 హెచ్పీ వాడాలంటే సపరేట్ ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్లు, కేబుల్ ఉండాలి. ఖరీదు కూడా ఎక్కువే. కాంగ్రెస్ హయాంలో లోవోల్టే సమస్యతో మోటర్లు కాలిపోయేవి. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు వస్తున్నది.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ సరిగా రాక రాత్రిపూట పొలం కాడికి పోయి మోటర్లు చాలుజేసెటోళ్లం. పొలానికి నీళ్లు పెట్టేందుకు అరగంటకు ఒకసారి లేచి చూసేటోడిని. లోవోల్టేజీతో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండె. మరమ్మతుతు చేసుకుని వచ్చే సరికి పంట ఎండిపోతుండె. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుండు. ఎప్పుడు నీళ్లవసరం ఉంటే అప్పుడు పోయి మోటర్ స్టార్ట్ చేస్తా.. కాంగ్రెస్ 3 గంటల కరెంట్ ఇచ్చి రైతులను మోసం చేయాలని చూస్తున్నది. 2కాంగ్రెసోళ్లు రైతుల జోలికి వస్తే ఖబర్దార్. 24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే రైతులమంతా మద్దతిస్తాం.