నర్సాపూర్, ఫిబ్రవరి 27: ‘పడకేసిన పల్లె ప్రగతి’ పేరుతో సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పాడైన గ్రామపంచాయతీ ట్రాక్టర్, పారిశుధ్యం లోపంపై వార్త వచ్చింది. దీంతో అధికారులు మంగళవారం అచ్చంపేట్, గొల్లపల్లి, నారాయణపూర్, లింగాపూర్ నుంచి గ్రామపంచాయతీ ట్రాక్టర్లు, ట్రాలీలు, పారిశుధ్య కార్మికులను బ్రాహ్మణపల్లికి తీసుకువచ్చి గ్రామంలోని చెత్తాచెదారాన్ని తొలిగించి, మురుగు కాల్వల నుంచి వ్యర్థాలను తీసివేశారు.
పాడైన ట్రాక్టర్ గురించి ఎంపీవో వైద్య శ్రీనివాస్ను వివరణ కోరగా డీపీఆర్వో, డీఎల్పీవో ఆదేశాల మేరకు ట్రాక్టర్ మరమ్మతుకు సంబంధించి కొటేషన్ను ప్రత్యేకాధికారి(తహసీల్దార్)కు అందించామని, దానికి అప్రూవల్ వెంటనే లభించిందని వెల్లడించారు. త్వరలోనే ట్రాక్టర్ను మరమ్మతు చేయించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులకు, నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు.