సిద్దిపేట, మార్చి 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో రిజర్వాయర్లు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్ల నిర్వాహణ, నీటిని నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తయ్యడంతో రిజర్వాయర్లలో నీరులేక బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో సాగునీరందక చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన తమ పొలాలను సెల్పీ వీడియోల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేలా రైతులు సందేశాలు పంపుతున్నారు. కాంగ్రెస్ సర్కారు రైతుల గురించి కనీసం ఆలోచన చేయడం లేదు. ఏ రైతును చూసినా ఆందోళన, ఆవేదన కనిపిస్తున్నది.కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటికి ఢోకా లేకుండే, పుష్కలంగా సాగునీరు ఇవ్వడంతో ప్రతి గుంటా సాగులోకి వచ్చింది. భూమికి బరువయ్యేలా పంటలు పండాయి. రైతుల జేబుల్లో పది రూపాయలు కనిపించాయి. బీఆర్ఎస్ సర్కారు అందించిన చేయూతతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారు. సాగు భూముల ధరలు సైతం పెరిగాయి. ఇదంతా గతం. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. సమై క్య రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి. పశువులకు సైతం గడ్డి దొరకక పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. అలాంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ దూరదృష్టితో జిల్లా లో పెద్ద ఎత్తున రిజర్వాయర్లను నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీటిని అందించారు. దీంతో బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లా పచ్చటి పొలాలతో అలరారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ నాటి గోస గుర్తుకు వస్తున్నదని రైతులు చెబుతున్నారు.
బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన రిజర్వాయర్లు నీళ్లు అడుగంటి బోసిపోయి కనిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ప్రధానంగా నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. మిడ్మానేరు నుంచి సిద్దిపేట జిల్లాలోకి రిజర్వాయర్లకు కాళేశ్వరం జలాలు వస్తాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో అనంతగిరి వద్ద అన్నపూర్ణ రిజర్వాయర్ను 3.5 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించారు. ఐదారేండ్లుగా ఈ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి రెండు జిల్లాలకు సాగు నీటిని అందించారు.మిడ్మానేరు రిజర్వాయర్ నుంచి ఈ రిజర్వాయర్లోకి నీరు వస్తుంది. అక్కడి నుంచి రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లలో నీటిని నింపుతారు. గత ఎన్నికల ముందు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లాలోని అన్ని రిజర్వాయర్లను పూర్తి సామర్ధ్యంతో నీటిని నింపించారు. దీంతో ప్రస్తుత యాసంగి పంటలకు ఉపయోగపడింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆ రిజర్వాయర్లను నింపలేదు. అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్ధ్యం 3.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.84 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి చేరి ఈ రిజర్వాయర్ ఏడారిని తలపిస్తున్నది. ఈ రిజర్వాయర్ కింద పంటలు ఎండిపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.రంగనాయక సాగర్ రిజర్వాయర్ సామర్ధ్యం 3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ఇది డెడ్స్టోరేజీకి చేరింది. ఈ రెండు రిజర్వాయర్ల పరిధిలో పంటలు పూర్తిగా ఎండి పోయి రైతుల ఆందోళన చెందుతున్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో జలభాండాగారాలుగా రిజర్వాయర్లు కనిపిస్తే.. ఇవాళ ఎడారిని తలపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే మా పంటలు ఇలా ఎండిపోయేవా? అని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోగా, ఇటీవల వడగండ్ల వర్షానికి పంటలు దెబ్బతిని రైతులకు భారీగా నష్టం వాటిల్లింది.
ఇటీవల కురిసిన వడగండ్ల వానకు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లాలో 1,794 మంది రైతులకు చెందిన 2,806 ఎకరాల, మెదక్ జిల్లాలో 2,154 మందికి చెందిన 2,766 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 343 మంది రైతులకు చెందిన 714 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 4,191 మంది రైతులకు చెందిన 6,286 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఇంత పంట నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పంట నష్టం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. మరో పక్క రుణాలు చెల్లించాలని రైతులకు బ్యాంకు వాళ్లు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం సాగుచేసిన పంటలను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు ఉన్నారు. రెండు రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు పంట పొలాలను పరిశీలించి రైతులను ఓదార్చుతున్నారు. రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అన్నపూర్ణ ప్రాజెక్టు మాకు ఆధారం. పోయిన యేడు ఈ కాలంలో అన్నపూర్ణ ప్రాజెక్టు నీళ్లతో మాఊరి చెరువు నింపారు. చెరువులో బాగా నీళ్లు ఉండటంతో పంటలు పండినాయి. ఈసారి చెరువులో నీళ్లలేక బోర్లు ఎండినాయి. నాకు న్న రెండెకరాలతో పాటు మరో ఎకరన్నర భూమిని కౌలుకు తీసుకుని వరి పంట ఏసిన. పంట పూర్తిగా ఎండుతోంది. దీంతో నాకు 2.5 లక్షల వరకు నష్టం జరిగింది. ప్రభుత్వం స్పందించి అన్నపూర్ణ ప్రాజెక్ట్ ద్వారా చెరువు నింపు రైతులను కాపాడాలి.