జహీరాబాద్, ఫిబ్రవరి 25: జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని తెలంగాణ సర్కారు మరోసారి కేంద్రానికి విన్నవించింది. మన్నెగూడ-వికారాబాద్-తాండూర్- జహీరాబాద్-బీదర్ 134 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలని గతంలో బీఆర్ఎస్ సర్కారు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 2021 మార్చిలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర రోడ్లు, ఉపరిత రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు.
ఎంపీ బీబీ పాటిల్ విజ్ఞప్తితో కేంద్ర మంత్రి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినా కేంద్రం పెండింగ్లో పెట్టింది. దీంతో రోడ్డు విస్తరణ పెండింగ్లో ఉండిపోయింది. తాజాగా సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెట్టి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి విన్నవించడంతో ఈ రోడ్డు విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మన్నెగూడ- వికారాబాద్- తాండూర్- జహీరాబాద్-బీదర్ 134 కిలోమీటర్ల రోడ్డు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో విస్తరించి ఉంటుంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ర్టాల ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిసింది. జహీరాబాద్, బీదర్, దెగ్లూర్ 112 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జహీరాబాద్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు 26 కిలోమీటర్లు ఈ రోడ్డు విస్తరించి ఉంది.
జాతీయ రహదారిగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి వివరాలతో రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ కేంద్రానికి లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. జహీరాబాద్-బీదర్ రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి ప్యాసింజర్, గూడ్స్ ఇతర వాహనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్తుంటాయి. వందలాది వాహనాలతో ఈ రహదారి రద్దీగా ఉంటుంది. జహీరాబాద్ నిమ్జ్ మధ్యలో నుంచి ఈ రోడ్డు వెళ్తుంది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ఉపకరిస్తుంది.