సంగారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో సంగారెడ్డి జిల్లా దూసుకెళ్తున్నది. ఉమ్మడిపాలనలో సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం వెనకబడి ఉండేది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధి చెందింది. సీఎం కేసీఆర్ కేజీ టు పీజీ విధానం అమలులోకి తీసుకురావటంతో జిల్లా విద్యారంగంలో అభివృద్ధి చెందింది. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, డిగ్రీ కళాశాలలకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించటంతోపాటు బోధన సిబ్బందిని నియమించింది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఉమ్మడి పాలనలో సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని ప్రజలు కోరినా అప్పగి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్ కళాశాలను మంజూరు చేశారు. దేశంలోనే మొట్టమొదటి గిరిజన గురుకుల లా కాలేజీని కూడా సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు.
ఆదర్శంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ అంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల విద్యాసంస్థలు ప్రైవేటుసంస్థలకు దీటుగా విద్యార్థులకు విద్యను అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, లింగంపల్లిలో జనరల్ గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఇందులో 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. నారాయణఖేడ్ నియోకవర్గంలోని జూకల్ ప్రాంతంలో సమీకృత విద్యాసముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ట్రైబల్, ఆశ్రమ్, సోషల్వెల్ఫేర్, పాలికటెక్నిక్, మోడల్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 12 సోషల్వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలు, 11 మహాత్మా పూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, 12 మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లాలో ఏడు గిరిజన గురుకులాలు ఉన్నాయి. ప్రభుత్వం రూ.9 కోట్లతో సొంత భవనాలను నిర్మించింది. ఇటీవలే రూ.5 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పటాన్చెరు నియోజకవర్గం పెద్దకంజర్లలో ప్రభుత్వ గిరిజన గురుకుల డ్రిగీ కళాశాల ఉంది. సంగారెడ్డి జిల్లాలో 17 కస్తూర్బా గురుకులాలు, పది రెసిడెన్షియల్ మోడల్ స్కూళ్లు ఉన్నాయి.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించటంతోపాటు ఆధునిక విద్యాబోధనను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లిషు మీడియం బోధనను ప్రారంభించింది. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తోంది.
మనఊరు-మనబడి
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా, మౌలిక సదుపాయాలు కల్పించాలన్న సంకల్పంతో జనవరి 22న ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలోభాగంగా డిజిటల్ విద్యతోపాటు పాఠశాలల్లో ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. పాఠశాలల్లో తాగునీటి వసతి, ఫర్నిచర్, ప్రహరీ, కిచెన్షెడ్లు, మరుగుదొడ్లు నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు. జిల్లాలో 1263 పాఠశాలలకు మన ఊరు-మనబడి మొదటి విడుతలో 441 పాఠశాలలను ఎంపిక చేశారు. 363 గ్రామీణ, 78 పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలను ఎంపిక చేశారు. 13 పాఠశాలలు ప్రారంభం కాగా 37 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 120 పాఠశాలలకు గ్రీన్ చాక్బోర్డులు, డ్యూయల్డెస్క్లు, 65 ఫర్నిచర్ టేబుల్స్ సరఫరా చేశారు. 124 ఉన్నత పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు మూడు చొప్పున 372 ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ టీవీలను ఇచ్చారు. 29 పాఠశాలల్లో సోలార్కిట్లు ఏర్పాటు చేయగా, 78 పాఠశాలల్లో కలర్ పెయింటింగ్లు పూర్తయ్యాయి.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు
జిల్లాలోని 17 కేజీవీబీ పాఠశాలల్లో 4,891 మంది బాలికలు చదువుతున్నారు. 17 కేజీవీబీల్లో ఆరు పాఠశాలలను ఇంటర్మీడియట్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశారు. జిన్నారం, అందోలు, సదాశివపేట, హోతి కే, ఝరాసంగం, నారాయణఖేడ్లలోని కేజీవీబీలు ఇంటర్మీడియట్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. మరో రెండు కాలేజీలు అప్గ్రేడ్ దశలో ఉన్నాయి.
మధ్యాహ్న భోజన పథకం
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రుచికరమైన ఆహారాన్ని అందజేస్తుంది. సన్నబియ్యంతో జిల్లాలోని 1,35,981 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తుంది. మధ్యాహ్న భోజనం వండే హెల్పర్లకు ప్రభుత్వం గౌరవ వేతనాన్ని రూ.1000 నుంచి రూ.2000కు పెంచింది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ప్రతిరోజూ 250 మి.లీటర్ల రాగి జావను అందజేయనున్నారు.
ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు
మాతృభాషపై ప్రావీణ్యాన్ని పెంచుతూనే ఆంగ్లభాషపై విద్యార్థులకు పట్టు పెంచేందుకు ప్రభుత్వం ఇంగ్ల్లిషు మీడియం పాఠశాలలను ప్రారంభించింది. 2022-23 సంవత్సరం నుంచి 1263 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రక్రియను ప్రారంభించింది. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కారణంగా 10,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. అలాగే ప్రభుత్వం ప్రతిఏటా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తోంది. రెండు జతల యూనిఫామ్స్ అందజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు నోట్ పుస్తకాలనూ ఉచితంగా అందజేయనుంది.
‘పది’లో మెరుగైన ఫలితాలు
2022-23 విద్యాసంవత్సరం పదోతరగతి ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మూడోస్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ శరత్ పదో తరగతిలో మెరుగైన ఫలితాలు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెన్త్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టీచర్స్ హ్యాండ్బుక్ను తయారు చేయించారు. పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థులకు అల్పాహారం అందజేశారు. 97.29శాతం ఉత్తీర్ణతతో సంగారెడ్డి జిల్లా పది ఫలితాల్లో రాష్ట్రంలో
మూడోస్థానంలో నిలిచింది.
సీవీ రామన్ సైన్స్ మ్యూజియం
విద్యార్థులను సైన్స్ ప్రయోగాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం రూ.2.10 కోట్లతో సంగారెడ్డి, నారాయణఖేడ్లలో సైన్స్ మ్యూజియంలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని విద్యార్థులను సైన్స్ మ్యూజియానికి తీసుకొచ్చి సైన్స్పై విద్యార్థులకు ఆసక్తి పెరిగేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. జాతీయ సైన్స్ పోటీలకు 23మంది విద్యార్థులు సంగారెడ్డి నుంచి వెళ్లారు. అందులో నలుగురు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వీరిలో ఇద్దరు జపాన్లో విద్యా విహారయాత్రకు ఎంపికయ్యారు.
సంగారెడ్డిలో మెడికల్, లా కాలేజీలు
ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలో రూ.30కోట్లతో ప్రభుత్వం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసింది. 150 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సంగారెడ్డి మెడికల్ కాలేజీ తరగతులను ఆన్లైన్లో ప్రారంభించారు. 60 సీట్లతో ప్రభుత్వం సంగారెడ్డిలో నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసింది. ఇటీవలే ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సంగారెడ్డిలో నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే మొదటిసారిగా సంగారెడ్డిలో 60మంది విద్యార్థులతో గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీని ప్రారంభించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గిరిజన లా కాలేజీలో చదువుతున్నారు. సాంకేతిక విద్యను బలోపేతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం సంగారెడ్డిలో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాల, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేసింది. సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ కాలేజీకి అనుబంధంగా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్స్ను ఏర్పాటు చేసింది. ఇందులో బీ ఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులను ప్రారంభించారు.