గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 2: పంటలకు ఊపిరి పోసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని మూడేళ్లుగా కూడవెల్లి వాగులోకి వదులుతుండడంతో వేలాది ఎకరాల్లో వరిపంట కళకళలాడుతున్నది. వేసవిలో తమ పంటలకు సాగునీరు ఎలా అందించాలన్న దిగులుతో ఉన్న రైతులకు కాళేశ్వరం జలాలను విడుదల చేసి వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నది రాష్ట్ర సర్కారు. కాళేశ్వరం నీటి విడుదలతో కూడవెల్లి వాగుపై నిర్మించిన 38 చెక్డ్యాంలు జలకళను సంతరించుకోనున్నాయి. కూడవెల్లి వాగులో నీరు పుష్కలంగా చేరుతుండడంతో ఆయకట్టు రైతులు సంబురపడుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో పరిసర ప్రాంత రైతులు వేలాది ఎకరాల్లో వరిపంట సాగు చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్లోకి వెళ్లే కాలువ ద్వారా గోదావరి జలాలను గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి వదులుతున్నారు. కాళేశ్వరం నీటి విడుదలతో కొడకండ్ల, రిమ్మనగూడ, బూరుగుపల్లి, సింగాటం, అహ్మదీపూర్, కొల్గూర్ గ్రామాలతోపాటు తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లో వరిపంటకు సాగునీరు పుష్కలంగా అందుతున్నది. దుబ్బాక మండలం ఆకారం వద్ద గోదారమ్మ సిద్దిపేట జిల్లాను వీడి కరీంనగర్ జిల్లాలోని ఎగువ మానేరు డ్యామ్లో కలుస్తుంది. ఇక్కడ నీరు వృథాను అరికడుతూ ఒడిసిపట్టడం ద్వారా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నీటిని వదులుతున్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కాళేశ్వరం నీటిని కూడవెల్లి వాగులోకి వదిలితే ఆ వాగు నిండుకుండలా కనిపిస్తున్నది. వాగులో నీరు పుష్కలంగా ఉంటే భూగర్భ జలాలు ఉబికి వచ్చి బోరుబావుల్లో నీటిమట్టాలు పెరిగే అవకాశాలున్నాయని స్థానిక రైతులు అంటున్నారు. ప్రభుత్వం ముందుచూపుతో చేసిన అభివృద్ధి పనులతో రైతులకు ఎంతో న్యాయం జరుగుతున్నదని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు మార్గం సుగమమైందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గజ్వేల్ మండలం కొడకండ్ల నుంచి జిల్లా సరిహద్దు కూడవెల్లి వాగులో గోదారమ్మ 60 కిలోమీటర్ల మేర పరవళ్లు తొక్కుతున్నది. ఫలితంగా కూడవెల్లి వాగుపై నిర్మించిన 38 చెక్డ్యాంలు గోదావరి జలకళను సంతరించుకుంటున్నాయి. గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని చెక్డ్యాంల్లో వారం రోజుల్లో కాళేశ్వరం జలాలు పుష్కలంగా చేరనున్నాయి. దీంతో రైతులు సాగుచేసిన 40 వేల ఎకరాల వరికి జీవం పోసినట్లవుతుంది. వేసవి సమీపిస్తున్న వేళ సాగునీటి ఎద్దడి సమస్య సహజం. ఇలాంటి పరిస్థితుల్లో పంటను కాపాడేందుకు సీఎం కేసీఆర్,
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేస్తున్న ప్రయత్నం రైతు కుటుంబాల్లో ఆనందం నింపుతున్నది.
కూడవెల్లి వాగులోకి నీళ్లను వదలడంతో ఈ ఏడు వరిసాగు చేసిన రైతులకు ఎంతో న్యాయం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రాజెక్టులను నిర్మించడంతో అందరికీ న్యాయం జరుగుతున్నది. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి. ఎప్పుడూ రైతుల బాగోగుల కోసమే తాపత్రయ పడుతాడు. మిషన్ కాకతీయతో చెరువులో పూడికతీత తీయడంతో చెరువుల్లో నీళ్లు ఎక్కువగా చేరడంతో భూగర్భజల మట్టం పెరిగింది. దీంతో రైతుల వ్యవసాయ బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు గజ్వేల్ ప్రాంతానికి దగ్గర్లోనే ఉండడంతో చాలా మంది రైతులు ఈ సారి ఎక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేశారు. – పండరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి
యాసంగి పంటకు సాగు నీరందించేందుకు కూడవెల్లిలోకి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కూడవెల్లి వాగులో నీటి ప్రవాహం తగ్గింది. మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతున్నది. వరిపైరు చేతికి వచ్చే సమయానికి వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ సమయంలో సాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఫలితంగా పంటలు ఎండిపోయే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని రైతుల విజ్ఞప్తితో సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాలతో వాగులోకి నీరు విడుద చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని తుక్కాపూర్లోని 12వ ప్యాకేజీ ద్వారా మల్లన్న సాగర్ కాలువ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని చెరువు, కుంటలను నింపుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా కూడవెల్లి వాగులో మల్లన్నసాగర్ నీటితో జలకళ సంతరించుకుంటున్నది. ప్రస్తుతం వాగు పరిసరాల్లో రైతులు వరిపంట విస్తారంగా సాగుచేస్తున్నారు. కూడవెల్లి వాగులో నీటిమట్టం తగ్గినందున మల్లన్నసాగర్ నుంచి నీటి విడుదల కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం కొడకండ్లకు రానున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొనాలని స్థానిక నాయకులకు పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా కూడవెల్లి వాగులోకి కాళేశ్వరం జలాలు వస్తుండడం ఆనందంగా ఉంది. దీంతో రైతులం సాగుచేసిన వరి కాపాడుకునే అవకాశం దక్కుతుంది. కూడవెల్లి వాగులోకి గోదావరి నీళ్లు వస్తే వందలాది మంది రైతులు వరిపంటకు మోటార్ల ద్వారా నీటిని వాడుకోవచ్చు. గోదావరి జలాలను ఈ ఏడు త్వరగానే కూడవెల్లిలోకి విడుదల చేస్తుండడంతో ఇక వరిపంటకు ఏ ఇబ్బందీ ఉండదు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి రైతులం రుణపడి ఉంటాం.
– చాడ విష్ణువర్ధన్రెడ్డి, రైతు, అహ్మదీపూర్