‘పర్వాలేదు చెప్పండి.. ఇక్కడ అందరూ ఆడవాళ్లే కదా ఉన్నారు.. నిర్భయంగా, నిర్మొహమాటంగా మీ సమస్యను వివరించండి’… అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న వైద్యుల వద్ద అతివలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరితో ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ ఇన్నాళ్లూ మనోవ్యధకు గురైన మహిళలు నోరు విప్పి మనసులో ఉన్న సమస్యను చెప్పుకోగలుగుతున్నారు. ఔను, స్త్రీలకు ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళా కార్యక్రమానికి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో విశేష స్పందన లభిస్తున్నది. మెదక్ జిల్లాలో ఆరు పీహెచ్సీల్లో ఆరోగ్య మహిళా క్లినిక్లు ప్రారంభించగా, సంగారెడ్డి జిల్లాలో నాలుగు క్లినిక్లలో ఈ సేవలు అందుతున్నాయి.
అన్ని వయసుల మహిళలకు సంబంధించి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశం కాగా, ప్రతి మంగళవారం ప్రత్యేకంగా క్లినిక్లలో వైద్య సేవలందిస్తున్నారు. మహిళలు నిర్మొహమాటంగా సమస్యను చెప్పుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లలో వైద్యులు, సిబ్బంది అందరూ మహిళలే ఉండేలా ఏర్పాట్లు చేసింది. ఈ కేంద్రాల ద్వారా మొత్తం ఎనిమిది విభాగాల్లో మహిళలకు అవసరమైన పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తున్నారు. ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ అయితే జిల్లాకేంద్ర దవాఖానకు రెఫర్ చేస్తున్నారు. ఈ సెంటర్లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది వారాల్లో మెదక్ జిల్లాలో మొత్తం 3,369 మంది మహిళలకు వైద్య సేవలు అందించారు. సంగారెడ్డి జిల్లాలో 2,368 మంది మహిళలకు వైద్య సేవలందిచారు. 1,468 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు.
– సంగారెడ్డి/ మెదక్, (నమస్తే తెలంగాణ), ఏప్రిల్ 28
సంగారెడ్డి ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్పూర్, ఝరాసంగం, జిన్నారం, రామచంద్రాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ నాలుగు కేంద్రాల్లో ఇప్పటివరకు 2,368 మంది మహిళలకు వైద్య సేవలు అందించారు. ఇందులో 1,468 మంది మహిళలకు ఎనిమిది రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. మెగురైన చికిత్స అవసరమైన వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు ఇతర పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేశారు. క్యాన్సర్ నిర్ధారణతోపాటు విటమిన్ బి – 12, క్యాల్షిషియమ్ డెఫిసెన్సీ పరీక్షలు చేయించుకోవాలంటే ప్రైవేటులో ఒక్కోదానికి రూ.1,000కి పైగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇలాంటి వాటికి సైతం ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ఉచితంగా చేస్తున్నారు. మార్చిలో 694 మంది మహిళలు ఆరోగ్య కేంద్రాలకు రాగా వారిలో 437 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిలో 362 క్యాన్సర్ పరీక్షలు, 141 గర్భాశయ, 332 నోటి వ్యాధులు, 37 సూక్ష్మ పోషకాల లోపాలకు సంబంధించి, 67 థైరాయిడ్, 69 విటమిన్-డి, 188 సీబీపీ(కంప్లీట్ బ్లడ్ పిక్చర్) పరీక్షలు చేశారు. 37 మందిని మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి పంపించారు. ఏప్రిల్లో ఇప్పటివరకు 1,674 మంది మహిళలకు వైద్య సేవలు అందించారు. వీటిలో 1,134 క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, 166 గర్భాశయ, 1,029 నోటి వ్యాధులు, 356 థైరాయిడ్, 241 విటమిన్-డి, 639 సీబీపీ పరీక్షలు చేశారు. 122 మంది మహిళలకు మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా దవాఖానకు రెఫర్ చేశారు.
నాలుగు కేంద్రాల్లో సేవలు
నాలుగు కేంద్రాల్లో ప్రతి మంగళవారం వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు 2,368 మంది మహిళలకు వైద్య సేవలు అందించాం. ఇటీవల కేంద్రాలను సందర్శించాను. వైద్య సేవలు బాగున్నాయని మహిళలు చెప్పారు. మంత్రి హరీశ్రావు సూచన మేరకు అందోల్, నారాయణఖేడ్, సంగారెడ్డిలో ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– డాక్టర్ గాయత్రీదేవి, డీఎంహెచ్వో