రాయపోల్, డిసెంబర్ 19: పంటల సాగులో రైతులు పాత పద్ధ్దతులను వీడి ఆధునిక సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. మూస ధోరణితో వ్యవసాయం చేస్తే ఆశించిన ఆదాయం లేక రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలతో శాస్త్రీయ పద్ధతులపై అవగాహన పెంచుకుంటూ కొత్త విధానాలు అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రధానంగా మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయల సాగు అన్నదాతలకు కలిసి వస్తున్నది.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో శౌరిపుర్, చెట్ల నర్సంపల్లి, ఎల్కల్, బేగంపేట, ఇందుప్రియాల్, రాంసాగర్, రామారం తదితర గ్రామాల్లో రైతులు అధికంగా కూరగాయలు పండిస్తున్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయంలో సాగు పద్ధ్దతులు క్రమంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో పందిరి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
పందిరి సాగుతో దిగుబడులు బాగా వస్తుండడంతో ఇటీవల సాగుచేసే రైతుల సంఖ్య పెరిగింది. పందిరి సాగుతో దీర్ఘకాలంగా లాభాలు ఆర్జించవచ్చు. అంతేకాకుండా ఉద్యానవన శాఖ ఏర్పాటుకు రాయితీలు ఇస్తున్నది. కాకర, బీర, టమాట, సొరకాయ, చిక్కుడు వంటి కూరగాయల సాగుకు పందిరిని విధానాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు.
తక్కువ శ్రమ..అధిక దిగుబడులు
సాధారణ సాగుతో పోలిస్తే పందిరి సాగుతో దిగుబడి అధికంగా ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు. సాధారణ సాగుతో ఎకరాకు దొండకాయ 5 టన్నుల వరకు దిగుబడి వస్తే పందిరి సాగుతో 15నుంచి 20 టన్నులు దిగుబడి వస్తున్నది. బీరకాయ పందిరి సాగు ద్వారా 10నుంచి 20 టన్నుల దిగుబడి సాధిస్తే, సాధారణ సాగులో 3టన్నుల మించి రావడం లేదని రైతులు చెబుతున్నారు.
కాకర సాధారణ సాగుతో 5 టన్నులు దిగుబడి రాగా, పందిరి సాగుద్వారా 10 నుంచి 15 టన్నులు వస్తున్నది. ఇక టమాట సాధారణ సాగుతో 5నుంచి 10 టన్నుల దిగుబడి వస్తే పందిరి సాగుతో 35 నుంచి 40 టన్నుల దిగుబడి పొందవచ్చని రైతులు పేర్కొంటున్నారు. పందిరి సాగుతో చేపట్టిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అదే నేల మీద సాగుచేస్తే 30శాతం వరకు పంట నష్టపోయే అవకాశం ఉంటుదని రైతులు తెలిపారు.
పందిరి సాగు ద్వారా ఏడాది పొడవునా సాగుకు అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాకుండాడ్రిప్ ద్వారా సాగుచేస్తుండడంతో తక్కువ నీరు అవసరపడుతున్నది. మండలంలోని వడ్డేపల్లి, రాంసాగర్, మంతూర్, వీనానగర్, రాంసాగర్ తదితర గ్రామాల్లో చాలా మంది రైతులు పందిరి సాగు ద్వారా
కూరగాయలు పండించి అధిక దిగుబడులు పొందుతున్నారు.