మల్కాపూర్ నుంచి యావాపూర్ డబుల్లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తున్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ఎఫ్డీసీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు
రాష్ర్టానికి అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ అని, రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంతో పాటు మల్కాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోనే తూప్రాన్ పట్టణానికి మూడు మార్కెట్ యార్డులు మంజూరు చేశామని అన్నారు. 14 ఏండ్లుగా ఇండ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, కాళ్లకల్, కూచారం గ్రామాలకు చెందిన 374 మంది భూ నిర్వాసితులకు నేడు ఇండ్ల పట్టాలు అందించడం ముఖ్యమంత్రి కేసీఆర్ చలవేనన్నారు.
ఉచిత కరెంటు, సాగునీటితో పాటు పెట్టుబడి సాయంగా రైతుబంధు అందజేస్తూ అన్నదాతల సంక్షేమానికి కృషిచేస్తున్నామని తెలిపారు. మనోహరాబాద్లో రెండోవిడత కంటివెలుగుపై సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులతో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి హాజరయ్యారు.
తూప్రాన్/ రామాయంపేట, జనవరి 9: అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ పట్టణానికి సోమవారం విచ్చేసిన ఆయన రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్తో కలిసి అల్లాపూర్ శివారులో రూ.5 కోట్లతో నిర్మించిన మార్కెట్ యార్డును ప్రారంభించారు. తూప్రాన్ పట్టణంలో రూ.20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మండల పరిధిలోని మల్కాపూర్లో పనులు పూర్తిచేసుకున్న రూ.80 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రూ.28 లక్షలతో నిర్మించిన యూత్ అండ్ లైబ్రరీ భవనం, రూ.75 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్, రూ.32 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం యావాపూర్ నుంచి మల్కాపూర్ వరకు రూ.20 కోట్లతో విస్తరించనున్న ఆర్అండ్బీ లింక్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోరే నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలోనే తూప్రాన్ పట్టణంలో మూడు వ్యవసాయ మార్కెట్ యార్డులను మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించడం తూప్రాన్ ప్రజల అదృష్టమని, నియోజకవర్గంలోని తూప్రాన్ పట్టణ రూపురేఖలు మారాయన్నారు. 14 ఏండ్లుగా ఇండ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, కాళ్లకల్, కూచారం గ్రామాలకు చెందిన 374 మంది భూ నిర్వాసితులకు నేడు పట్టాలు అందించడం సీఎం కేసీఆర్ చలవేనన్నారు. గత ప్రభుత్వాలు 2008లో పట్టాలిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నాయని, కానీ, సీఎం కేసీఆర్ నేడు భూ నిర్వాసితులకు పట్టా సర్టిఫికెట్లు అందించి, ప్రజలకు అండగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు తీసుకున్న ట్రాక్టర్లకు పన్ను రద్దు, గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో నీటి తీరువాను రద్దు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
రైతుల సంక్షేమానికి కృషి
రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని, ఉచిత కరెంటు, సాగునీరు అందించడంతో పాటు పెట్టుబడి సాయం గా రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నామన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఉద్యోగులకు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సైతం జీతాలు ఆపి రైతులకు రైతు బంధు వేశామన్నారు. వృద్ధులకు ఆసరాగా రూ.2వేల పెన్షన్లు, పేదింటి ఆడబిడ్డ పెండ్లి కానుకగా కల్యాణలక్ష్మి అందిస్తున్నామన్నారు. రైతుబంధు ద్వారా రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రూ.65 వేల కోట్లు జమ చేశామన్నారు. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే రూ. 5 లక్షల చొప్పున 98 వేల మంది రైతుల కుటుంబాలకు రూ.5,300ల కోట్లు అందించామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని వాగులు, వంకలు నిండు కుండలా హల్దీవాగు ప్రవహించడం కాళేశ్వరం చలవేనన్నారు. కాళేశ్వరం ద్వారానే వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నీళ్లు తాగించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. 2016 నుంచి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లతో పాటు 10 కిలోల బియ్యం అందిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నాలుగేండ్ల క్రితం కంటి వెలుగును ప్రారంభించి యువతకు, వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు. తూప్రాన్ పట్టణంలో 50 పడకలతో దవాఖాన నిర్మించి తల్లీపిల్లలకు ఆరోగ్య సంరక్షణ కింద కేసీఆర్ కిట్లను ప్రభుత్వం అందజేస్తున్నదన్నారు.
ఒకప్పటి జంగిల్ పట్టి నేడు మల్కాపూర్
నాటి జంగిల్ పట్టి నేడు అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఆదర్శంగా మల్కాపూర్ గ్రామం రూపుదిద్దుకుందని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం తూప్రాన్తో పాటు మండలంలోని మల్కాపూర్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. 2018 ఆగస్టు 15న ప్రారంభించిన మొదటి విడత కంటి వెలుగు వంటి అద్భుతమైన పథకాన్ని ప్రారంభించడానికి సీఎం కేసీఆర్ మల్కాపూర్కు ఎంచుకోవడం గ్రామప్రజల అదృష్టమని, కేసీఆర్ అడుగు పెట్టడంతో గ్రామ దశదిశ మారిందన్నారు. ఈనెల 18 నుంచి రెండో విడత కంటి వెలుగు ప్రారంభమవుతుందన్నారు.
మారుమూల పల్లె మల్కాపూర్ను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధితో నేటి మల్కాపూర్ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయన్నారు. నూతనంగా ప్రారంభించిన లైబ్రరీ, యూత్ బిల్డింగ్లలో యువతకు అవసరమైన పుస్తకాలను సమకూర్చే బాధ్యతను అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్కు అప్పగించారు. రెండో విడత ఇంటికో పాడి పశువుల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని పశువైద్యాధికారులను మంత్రి ఆదేశించారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణ
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల శ్రేయస్సు కోసం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్నారన్నారు. ఇది ఓర్వలేని బీజేపీ నాయకులు మైకులు పట్టుకొని తిట్టడమే తప్ప దేశంలో ఏ రైతుకు సహాయం చేసింది లేదన్నారు. రైతులను దేశప్రజలను ఆదుకోవడం కోసమే బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ విస్తరింపజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఎంపీపీ గడ్డి స్వప్నావెంకటేశ్ యాదవ్, జడ్పీటీసీ రాణి సత్యనారాయణ, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ‘గడా’ అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాం ప్రకాశ్, మున్సిపల్ కమిషనర్ మోహన్, తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీశ్చారి, మల్కాపూర్ సర్పంచ్ మహదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, యావాపూర్ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎంపీటీసీ సంతోశ్రెడ్డి, ఎంపీడీవోలు అరుంధతి, యాదగిరిరెడ్డి, తహసీల్దార్లు జ్ఞానజ్యోతి, భిక్షపతి, తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్లు, పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఆటపాటలు
తూప్రాన్ మండలం మల్కాపూర్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం వేదికపై కళాకారుల ఆటపాటలు ప్రతి ఒక్కరినీ మంత్ర ముగ్దులను చేశాయి. కళా ప్రదర్శనలో భాగంగా మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కళాకారులను ఉత్సాహపరిచారు. వారితో కలిసి ఫొటోలు దిగారు.