రామాయంపేట, డిసెంబర్ 6 : ఒకప్పుడు ఎటు చూసినా గుంతలు, గతుకుల రోడ్లు. కొద్దిపాటి దూరం నడిస్తే చాలు కాళ్లకు బొబ్బలొచ్చేవి. ప్రధానంగా గ్రామాలకు దూరం గా ఉండే గిరిజన తండాల్లో పరిస్థితి మరీ అధ్వానం. ప్రజలు వివిధ పనుల కోసం పంచాయతీ కేంద్రాలకు కిలోమీటర్ల కొద్దీ కాలినడకన వస్తుంటారు. అష్టకష్టాలు పడు తూ అంత దూరం వచ్చినా, అక్కడ పనులు కాకుంటే తిరిగి వెళ్లి మరుసటి రోజు మళ్లీ రావాల్సిందే. ఇన్ని సార్లు రాకపోకలతో అనేక ఇబ్బందులు పడేవాళ్లు.
తండాల్లో ఎవరికైనా రోగమొచ్చినా ఏదైనా కష్టమొచ్చినా పట్టణాలకు వెళ్లలేక మంచం పట్టి బతుకు జీవుడా అంటూ అక్కడే బతుకులు చాలించేవారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చి రావడంతోనే సీఎం కేసీఆర్ పల్లె ప్రాంతాలే దేశానికి పట్టుగొమ్మలంటూ మహాత్మాగాంధీ అన్న సూక్తులను అనుసరిస్తూ మరో గాంధీలా తనదైన శైలిలో అభివృద్ధి బాటలో రాష్ర్టాన్ని నడిపిస్తున్నాడు. రామాయంపేట మండల వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలతో రోడ్ల పనులు పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటించి తండాలన్నింటినీ హరిత శోభితంగా తయారు చేసింది. నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేయడంతో రామాయంపేట-గజ్వేల్ రోడ్లే కాకుండా మారుమూల పల్లెలు సైతం పచ్చని హరివిల్లులా దర్శనమిస్తున్నాయి.
దశాబ్దాలుగా సరైన రోడ్డు సౌకర్యం లేక వెలవెలబోయిన తండాలకు జీవం పోసిన తెలంగాణ సర్కార్కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు గిరిజన ప్రాంత వాసులు. రామాయంపేట పట్టణంలోని సమస్యలు కోకొల్లలు. ఎక్కడ చూసినా పొంగిపొర్లుతున్న మురుగుకాల్వలు, పందులు, కుక్కలు, కోతుల సంచారంతో పట్టణ వాసులు ఎన్నో కష్టాలు అనుభవించారు. ప్రస్తుతం అభివృద్ధి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ రూ.కోట్ల వ్యయంతో వివిధ పనులు చేపట్టడంతో పట్టణాలతో పాటు పల్లె ప్రాంతా లు, గిరిజన ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అలాగే, గతంలో మారుమూల గ్రామాల విద్యార్థులు చదువుకునేందుకు రామాయంపేటకు రావాలన్నా తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సు టాపుపైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణాలు చేసేవారు. కానీ నేడు అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడి బస్సుల సంఖ్య పెరిగి విద్యార్థులు క్షేమంగా చేరుకుంటున్నారు.
రామాయంపేటను మున్సిపాలిటీగా మార్చిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రత్యేక నిధులను కేటాయించి పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. మురుగుకాల్వల మరమ్మతులకు రూ.9కోట్లు కేటాయించి పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. 2016 హరితహారంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నాటిన మొక్క నేడు పెరిగి పెద్ద దై పాదాచారులకు నీడను ఇస్తున్నది. తమ ప్రాంతంలోని గిరిజన తండాలను గతంలో ఏ ప్రభుత్వాలు గుర్తించలేదని, కేవలం తెలంగాణ సర్కారు మాత్రమే అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పద్మక్కను యాదుంచుకుంటం..
మా తండాలకు రోడ్లు వేయడమే కాకుం డా ఇరువైపులా మొక్కలను నాటించిన పద్మక్కకు జీవిత కాలం రుణపడి ఉంటాం. దశాబ్దాలుగా మమ్మల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. పద్మక్క గెలిచినందునే మాకు రోడ్డు వచ్చింది. మా ఇళ్లలో పెట్టుకున్న మొక్కలతో పాటు రోడ్ల వెంట ఉన్న చెట్లను కూడా నీళ్లుపోసి పెంచుకుంటాం.
– రాధ, రామాయంపేట గిరిజన తండా
మాటమీద నిలబడే ఎమ్మెల్యేపద్మాదేవేందర్రెడ్డి
మాటమీద నిలబడే వ్యక్తి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి. నేడు మెదక్ జిల్లా కావడం, అందులో రామాయంపేట మున్సిపాలిటీ కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. సీఎం సైతం ఎమ్మెల్యే తనబిడ్డ అని, మెదక్ జిల్లాలో ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా, అభివృద్ధి పనుల కోసం ఏ సాయం అడిగినా నిధులను సమకూరుస్తున్నారు. ఈ మధ్యలోనే మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేశారు. త్వరలోనే పనులు మొదలు పెడతాం.
– పల్లె జితేందర్గౌడ్ ,పురపాలక చైర్మన్రామాయంపేట