నర్సాపూర్, ఫిబ్రవరి27: ఎలక్షన్ డ్యూటీ డిప్యూటీ తహసిల్దార్ విజయక్ష్మి తనను మానసికంగా వేధిస్తున్నారని ఆర్డీవో కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న ఎలక్షన్ ఆపరేటర్ ఎం. రాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఆర్డీవో కార్యాలయంలో ఎలక్షన్ ఆపరేటర్గా ఔట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్నానని వెల్లడించారు. పై అధికారి అయిన నయాబ్ తహసిల్దార్ విజయలక్ష్మి తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. గత 4 నెలలుగా ఉద్యోగ రీత్యా ఔట్ సోర్సింగ్ అని చిన్న చూపు చూస్తు తిట్టడం, అందరి ముందు అవహేళన చేస్తూ అవమానించడం చేస్తుందని ఆరోపించాడు.
ఉన్నత స్థాయి అధికారి అని స్థాయి మరిచిపోయి తనపై చెడుగా ప్రచారం చేయడం చాలా బాధగా ఉందని తెలిపారు. దీని ద్వారా తనకు, తన కుటుంబానికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నదని వాపోయాడు. రెండు నెలల క్రితం 10 రోజులు సెలవు కూడా పెట్టడం జరిగిందని, అయినా తనలో ఎలాంటి మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయిన ఎవరు పట్టించుకోవడం లేదని వెల్లడించారు.
విధి నిర్వహణలో పనులు సక్రమంగా చేస్తున్న తను చాలా రకాలుగా వేధిస్తున్నారని తెలిపారు. తనకు సంబంధం లేని పని విషయంలో కూడా చొరవ తీసుకొని తనను టార్గెట్ చేస్తుందని పేర్కొన్నారు. తను చేయాల్సిన పనులను కూడా తనతో చేయిస్తుందని, చివరకు బాత్రూమ్ వెళ్లాలన్న అనుమతి తీసుకోవాలని చిత్రవిచిత్రాలుగా వేధిస్తుందన్నారు. ఈ ఇబ్బందులు తట్టుకోలేక రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, పై అధికారులు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.