అక్కన్నపేట, జూన్ 7: రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ తీసుకువస్తామని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం హుస్నాబాద్లోని వ్యవసాయ మా ర్కెట్ యార్డులో రైతు మహోత్సవం రెండో రోజు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ దృష్టికి చాలా రైతు సమస్యలు వస్తున్నాయని, కమిషన్ క్షేత్ర స్థాయి లో పర్యటిస్తూ, సమస్యలపై అధ్యయనం చేస్తూ పరిష్కార మార్గాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. త్వరలోనే 4 ఎకరాలపై ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమవుతాయని తెలిపారు.
ఆదర్శ రైతు వ్యవస్థ, చెరువులు, కుంటల పునరుద్ధరణ, రైతులకు మట్టి నమూనా పరీక్ష పరికరాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల పంపిణీ, పండే పంటలకు అనుగుణంగా కొత్త మార్కెట్లు ఏర్పాటు, ఆధునీకరణ మార్కెట్ల వ్యవస్థ, కౌలు రైతుల విషయం లో నిర్ధిష్టమైన ప్రణాళికలు, విత్తన చట్టం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేలా కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు లు చేసినట్లు తెలిపారు. కేబినెట్ ఆమోదం తర్వా త అవి అమలు కానున్నాయన్నారు.
ములుగు జిల్లాలో మల్టీనేషనల్ కంపెనీ రైతులను మోసం చేశాయని, ఈ విషయంలో కమిషన్ విచారణ చేపట్టి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2004 నుంచి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలినారు. రైతే పెద్ద శాస్త్రవేత్త, దశాబ్దాలుగా ఎవుసం చేస్తూ, ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో, వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్నాడని వివరించారు. సంప్రదాయ పంటల్లో పసుపు ఒక పంట అని, ఈ పసుపు ద్వారా కరోనా సమయంలో ఎందరో బతికి బయటపడ్డారని కోదండరెడ్డి అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా దేశ ప్రధాని మోదీ వెల్లడించారని గుర్తు చేశారు.
ఎవుసంలో పెట్టుబడి తగ్గి ఆదా యం వచ్చే పంటలు వైపు మళ్లాలని రైతులకు సూచించారు. పంట చేన్ల వద్ద కోతుల బెడద నివారించేందుకు నాబార్డు సహకారంతో సోలార్ ఫెన్సింగ్ వేసుకునేలా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం స్టాళ్లను ఆయన సందర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, కమిషన్ సభ్యులు కేవీన్ రెడ్డి, భవానీరెడ్డి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు , శాస్త్రవేతలు, రైతులు పాల్గొన్నారు.