వర్గల్, ఏప్రిల్ 14: “ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కష్టాలు బాధలు ఎలా ఉంటాయో తెలిసినవాడిని, కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రజల మధ్యలో తిరిగి వారి సమస్యలను పరిష్కరించా. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునందుకొని మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నాయకులు, ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద గల శ్రీలక్ష్మీమాధవ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేలూరి వెంకట్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మెదక్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు ప్రజల బాధలు, సమస్యలు ఎలా ఉంటాయో తెలుసుకున్నానన్నారు. సేవ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానని చెప్పారు. మీ బిడ్డగా, మీ అన్నగా, మీలో ఒకడిగా ఆశీర్వదిస్తే జీవితాంతం సేవచేస్తానన్నారు. తెలంగాణలో ఎండాకాలం వచ్చిందంటే తాగడానికే నీళ్లు ఉండని గ్రామాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు గోదావరి నీళ్లు తాగించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
కరువు నేలపై గోదావరి జలాలు పారించిన బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలా? కరెంట్ కోతలు, కరువు కాటకాలు తెచ్చిన కాంగ్రెస్కు ఓటు వేయాలా? మతాలపేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి ఓటు వేయాలా ప్రజలు తెలుసుకునే సమయం వచ్చిందన్నారు. రఘునందన్రావు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నాడని ఆరోపించారు. కుటుంబ సభ్యుల అనుమతితో రూ.100 కోట్లతో నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తానన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు జహంగీర్, మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీలు అర్జున్గౌడ్, బాలుయాదవ్, ఎంపీపీలు లతారమేశ్గౌడ్, లావణ్యాఅంజన్గౌడ్, జిల్లా నాయకులు నాగరాజు, ములుగు, వర్గల్ మండలాల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ కమిటీల అధ్యక్షులు, మాజీ ప్రజాపతినిధులు పాల్గొన్నారు.