మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 27 : పోలీసుల విచారణలో తీవ్రంగా గాయపడి ఖదీర్ఖాన్ మృతిచెందడం బా ధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది అన్నారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు మృతుడి భార్య సిద్దేశ్వరిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు. అనంతరం జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది మెదక్ చర్చిని సందర్శించారు. చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆమెను ఆశీర్వదించారు. చర్చి కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. మెదక్లోని మైనార్టీ సంక్షేమ పాఠశాలలను ఆమె సందర్శించారు. ఆమెతో సయ్యద్ షెహజాది వెంట జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి జెమ్లా నాయక్, మెదక్ ఆర్డీవో సాయిరాం ఉన్నారు.