పెద్దశంకరంపేటః రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి అందుబాటులో నెలకొల్పుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి కోరారు. బుధవారం పీఎసీఎస్ ఆధ్వర్యంలో పెద్దశంకరంపేట, జంబికుంట గ్రామాల్లో, ఐకేపీ ఆధ్వర్యంలో మండలపరిధిలోని కమలాపురం, బుజ్రాన్పల్లి గ్రామాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు వరి పంటలకు బదులుగా వ్యవసాయాధికారులు సూచించిన మేరకు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.
రైతు పండించిన ప్రతి దాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మార్కెటింగ్ సమస్య రావొద్దనే ఉద్ధేశంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పీఎసీఎస్ చైర్మన్ సిద్ద సంజీవరెడ్డి, ఐకెపీ ఏపీఎం గోపాల్, సర్పంచ్ సత్యనారాయణ, మండల రైతుబంధు అధ్యక్షుడు సురేశ్గౌడ్, మానిక్రెడ్డి, సీఈవో రవీందర్, తదితరులున్నారు.