కాంటా టకాటకా చేస్తున్నారు.. చెల్లింపులు చకచకా అయిపోతున్నాయి… మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వరిధాన్యం తూకం జోరుగా సాగుతున్నది. ఉభయ జిల్లాల్లోనూ ధాన్యం సేకరణ ప్రక్రియ ఊపందుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. మెదక్ జిల్లాలో 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో అప్పటికే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ధాన్యాన్ని అక్కడే ఆరబెట్టిన తర్వాత కాంటా పెడుతున్నారు. అటు సంగారెడ్డి జిల్లాలో అకాల వర్షాల కారణంగా నిలిచిపోయిన వరికోతలను రైతులు తిరిగి ప్రారంభించారు. ఈ జిల్లాలోనూ రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. మెదక్ జిల్లాలో మొత్తం 397 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 50857 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది. 2,738 మంది రైతులకు రూ.24.21 కోట్లు చెల్లింపులు జరిగాయి. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 209 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. ఇప్పటివరకు 11075 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, రూ.6.17 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
-సంగారెడ్డి /మెదక్, మే 12 (నమస్తే తెలంగాణ)
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వరిధాన్యం కాంటా టకాటకా సాగుతున్నది. ఉభయ జిల్లాల్లోనూ ధాన్యం సేకరణ ఊపందుకున్నది. వర్షాలు కురుస్తున్నప్పటికీ ధాన్యం సేకరణ జరుగుతున్నది. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ధాన్యం సేకరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. గ్రేడ్-ఏ రకం ధాన్యం క్వింటాల్కు రూ.2060, కామన్ రకం రూ.2040 ధర ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన ధరకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచారు. మెదక్ జిల్లాలో గత వారం, పది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కాంటా పెడుతున్నారు. ఇదిలా ఉండగా, సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కురవడంలేదు. దీంతో రైతులు వరి కోతలు తిరిగి ప్రారంభించారు. రాబోయే రెండు రోజుల్లో వరిధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి.
మెదక్లో ఊపందుకున్న కొనుగోళ్లు
మెదక్, మే 12 (నమస్తే తెలంగాణ): జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ ఆధ్వర్యంలో 397 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని భారీగా తరలిస్తున్నారు. ఎక్కడ చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కాంటా వేగం పెంచారు. ఇదిలా ఉండగా, గత వారం, పది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టి ఆ తర్వాత కాంటా పెడుతున్నారు.
బీహార్ కూలీలకు ఉపాధి…
ధాన్యం తూకం వేయడానికి స్థానికంగా హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో బీహార్కు చెందిన కూలీలపై ఆధారపడుతున్నారు. ఆ రాష్ర్టానికి చెందిన యువకులు ముందుకు రావడంతో హమాలీల కొరత తీరుతోంది. దాదాపు జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో బీహార్కు చెందిన కూలీలే హమాలీ పనులు చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద 20 నుంచి 25 మంది బీహార్ కూలీలు పనిచేస్తున్నారు. తమ రాష్ర్టాల్లో ఉపాధి దొరకకపోవడంతోనే తెలంగాణ రాష్ర్టానికి వస్తున్నామని కొంత మంది బీహార్ కూలీలు వాపోయారు.
రైతుల ఖాతాల్లో వెనువెంటనే డబ్బులు…
ప్రస్తుత సీజన్లో ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.2,060 చొప్పున, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,040 చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోకే తరలిస్తున్నారు. 20 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు మొదలయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు 7,907 మంది రైతుల నుంచి 3,3,296 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రూ.68.59 కోట్ల ధాన్యం సేకరించామని, రూ.27 కోట్ల విలువైన ధాన్యం ట్యాబ్ ఎంట్రీ పూర్తయిందని పేర్కొన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు.
ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షణ…
జిల్లాలో వర్షాలు కురుస్తున్న సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. వర్షాలతో ధాన్యం తడిసిపోయిన రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత కాంటా వేయాలని సూచిస్తున్నారు. రైతులు ఎవరూ కూడా ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దని, కొనుగోలు కేంద్రాలకే ధాన్యం తరలించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తుందని పేర్కొన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటిప్పుడు లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించేలా చూడాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లాలో సజావుగా..
సంగారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిర్ణయం మేరకు అధికారులు జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 96, పీఏసీఎస్ల పర్యవేక్షణలో 87, డీసీఎంఎస్ 26 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 209 కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లా అంతటా ధాన్యం కొనుగోళ్లు సాగిస్తున్నారు. ధాన్యంలో 17 శాతం తేమ ఉంటే కొనుగోలు చేస్తున్నారు. 44.96 లక్షల గన్నీ బ్యాగులను ధాన్యం సేకరణ కోసం అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కురవడంలేదు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరికోతలు నెమ్మదించాయి. వరికోత యంత్రాలు పొలాల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కోతలను ఊపందుకోలేదు. కాగా, ప్రస్తుతం వర్షాలు కురవడంలేదు. దీంతో రైతులు వరి కోతలు తిరిగి ప్రారంభించారు. రాబోయే రెండు రోజుల్లో వరిధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి.
11075 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్లో 76186 మంది రైతులు 1,09,554 ఎకరాల్లో వరి సాగు చేశారు. యాసంగిలో 2,03,828 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతుల అవసరాలు పోగా 1,83,480 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 209 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 11075 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఐకేపీల పరిధిలోని 96 కొనుగోలు కేంద్రాల ద్వారా 5748.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. పీఏసీఎస్, డీసీఎంఎస్లు నిర్వహిస్తున్న 113 కొనుగోలు కేంద్రాల ద్వారా 5327.36 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 2245 మంది రైతుల నుంచి 22.82 కోట్ల విలువ చేసే 11075 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో 9623 టన్నుల ధాన్యం రైసు మిల్లులకు తరలించారు. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.6.17 కోట్ల ధాన్యం డబ్బులు జమ చేశారు. కాగా, రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు
ఊపందుకోనున్నాయి.
ఇప్పటి వరకు రూ.12 కోట్లు జమ చేశాం…
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు 33,396 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, అందులో నుంచి 32,439 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరిగింది. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.12.80 కోట్లు జమ చేశాం. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటిప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నాం. ధాన్యం కాంటా అయిన వెంటనే లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించాలని కేంద్రం నిర్వాహకులకు సూచిస్తున్నాం.
– రమేశ్, అదనపు కలెక్టర్, మెదక్