చేర్యాల, జూలై 21 : మనిషి జీవనశైలి మారింది. జీవితం ఉరుకులు పరుగులుగా మారింది. శారీకర శ్రమ తగ్గింది. శ్రమలేని పనులు, అధిక ఒత్తిడితో మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. 25ఏండ్లకే బీపీ, షుగర్, 40ఏండ్లకే హార్ట్స్ట్రోక్కు గురవుతున్నాడు. ఎనిమిదేండ్లకే ఊబకాయం అంటూ దవాఖానల చుట్టూ తిరుగుతున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. రోగాలకు దూరంగా ఉండేందుకు చిరుధాన్యాల బాట పడుతున్నాడు. ఆరోగ్యానికి చిరునామాగా మార్చుకుంటున్నాడు. అయితే చాలామందికి చిరు ధాన్యాల పై అవగాహన తక్కువ ఉంది.
చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
ఒకనాడు నవ్వుతూ దాదాపు వందేళ్లు బతికేవారు. నాడు ఎవరిని దీవించినా శతమానం భవతి అని అనేవారు. నేడు అలా దీవించాలంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనిషి ఆయు ప్రమాణం అంతలా పడిపోయింది. 40ఏండ్లు దాటితే చాలు, ఏ నిమిషం ఎలా ఉంటుందోనని కంగారుపడుతూ బతుకుతున్నారు. 60ఏండ్లు ఆరోగ్యంగా జీవిస్తే చాలనే స్థాయికి వచ్చేశారు. వరి, గోధుమల కంటే చిరుధాన్యాల్లో 30-50శాతం సూక్ష్మపోషక విలువలు అధికంగా కలిగి ఉంటాయి. కష్టమైన ఇష్టంగా చిరుధాన్యాలను తినడం కొందరు అలవాటు చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నారు.
చిరుధాన్యాలతో ప్రయోజనాలు
* మన శరీరానికి కావాల్సిన పిండి పదార్థాలను అందజేస్తాయి. మాంసకృత్తులతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే సూక్ష్మపోషకాలను మానవ శరీరానికి అందిస్తాయి.
* క్యాల్షియం అధికంగా ఉండడంతో చిన్నపిల్లల ఎదుగుదలకు, వృద్ధులు, స్త్రీలలో ఎముకల బలానికి, దంతాల వృద్ధికి చిరుధాన్యాలు చాలామంచి ఆహారం
* కండపుష్టిని శరీర దృఢత్వాన్ని పెంచుతాయి. కంటి, మెదడు, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
* శరీరంలోని కొవ్వు శాతాన్ని నియంత్రిస్తాయి. బీపీని నియంత్రణలో ఉంచుతాయి.
* చిరుధాన్యాల్లో పుష్కలంగా లభ్యమయ్యే సహజ ఖనిజ లవణాలతో గుండె వ్యాధులు, మైగ్రేన్ సమస్యలు దరి చేరనీయదు.
* జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఆరోగ్యకరమైన చర్మానికి దోహదపడుతాయి.
* చిరుధాన్యాల్లో ఉంటే ఫొటో కెమికల్స్, పైటేట్ పీచు పదార్థం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
జొన్నలు
కండపుష్టి, ఎముకల పటుత్వం పెంచుతాయి. రక్తంలో కొవ్వు శాతాన్ని నియంత్రిస్తాయి. రక్తహీనత, ఊబకాయం, మలబద్ధకం నివారణకు చక్కని ఆహారం. నరాల బలహీనత, నోటిపుండ్లు, మానసిక రుగ్మతలను దరిచేరనివ్వవు. రోగ నిరోధకశక్తి పెంచుతుంది. జొన్నల్లో 10.4గ్రాముల ప్రొటీన్, 19గ్రాముల ఫ్యాట్, 16గ్రాముల ఫైబర్, 72.6గ్రాముల కార్పోస్, 24మి.గ్రా. క్యాల్షియం, 41గ్రాముల ఐరన్ ఉంటుంది.
అండుకొర్రలు
రక్తహీనత, మలబద్ధకం, జీర్ణకోశవ్యాధుల నివారణ, ఊబకాయం, థైరాయిడ్, కంటి సమస్యలకు చక్కటి ఆహారం అండుకొర్రలు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తంలో చెడు కొవ్వును బయటకు పంపించేస్తుంది. గుండెకు బలాన్ని ఇస్తుంది. అండుకొర్రల బియ్యంలో 11.9గ్రాముల ప్రోటీన్, 1.89గ్రా. ఫ్యాట్, 42గ్రామ మినరల్స్, 12.5 ఫైబర్, 71.32గ్రా కార్పోస్, 28 గ్రాముల క్యాల్షియం, 7.72 గ్రాముల ఐరన్ ఉంటుంది.
సజ్జలు
సజ్జల్లో కెరోటిన్ అనే పదార్థం పుష్కలంగా ఉండడంతో కంటి చూపునకు చాలామంచిది. ఊబకాయం, మధుమేహం, మొలలతో బాధపడేవారికి చక్కని ఆహారం. రక్తపోటుకు, గుండె బలానికి ఎసీడీటీ సమస్యలకు మందులా పనిచేస్తుంది. మూర్చవ్యాధి, నిద్రలేమి, పిల్లల్లో అస్తమా సమస్యలను పరిష్కరిస్తుంది. సజ్జలో 11.6గ్రా ప్రోటీన్, 50గ్రా ఫ్యాట్, 2.3గ్రా మినరల్స్, 1.2గ్రా ఫైబర్, 67.5గ్రా కార్పోస్, 42మిల్లీగ్రామ్ల క్యాల్షియం, 80గ్రా ఐరన్ ఉంటాయి.
సామలు
సామ బియ్యంతో మనకు చాలా లాభాలున్నాయి. పైత్యం ఎక్కువ అవడంతో వచ్చే సమస్యలను నిరోధిస్తుంది. భోజనం తర్వాత గుండెల్లో మంట, పుల్లత్రేన్పులు రావడం, పైత్యరసం గొంతులో వచ్చినట్లు ఉండడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. వీర్యకణ సమస్యలు, ఆడవాళ్ల రుతు సమస్యలు, సంతాన లేమి నివారణ, మైగ్రేన్, గుండె మొదలైన సమస్యలకు మందు సామబియ్యంలో ఉన్నాయి. ఇందులో 7.7గ్రాముల ప్రొటీన్, 4.7గ్రా ఫ్యాట్, 1.5గ్రా ఫైబర్, 67 గ్రామ కార్పోస్, 17మి.గ్రా క్యాల్షియం, 9.3గ్రా. ఐరన్ ఉంటుంది.
సామలు
సామ బియ్యంతో మనకు చాలా లాభాలున్నాయి. పైత్యం ఎక్కువ అవడంతో వచ్చే సమస్యలను నిరోధిస్తుంది. భోజనం తర్వాత గుండెల్లో మంట, పుల్లత్రేన్పులు రావడం, పైత్యరసం గొంతులో వచ్చినట్లు ఉండడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పని చేస్తుంది. వీర్యకణ సమస్యలు, ఆడవాళ్ల రుతు సమస్యలు, సంతాన లేమి నివారణ, మైగ్రేన్, గుండె మొదలైన సమస్యలకు మందు సామబియ్యంలో ఉన్నాయి. ఇందులో 7.7గ్రాముల ప్రొటీన్, 4.7గ్రా ఫ్యాట్, 1.5గ్రా ఫైబర్, 67 గ్రామ కార్పోస్, 17మి.గ్రా క్యాల్షియం, 9.3గ్రా. ఐరన్ ఉంటుంది.
కొర్రలు
డయాబెటీస్కు దివ్యౌషధం కొర్రలు. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్, ఉదర, మూత్ర సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆకలి, మాంధ్యం, నరాల పటుత్వానికి ఉపయోగపడుతుంది. అతిసార, రక్తహీనత, ఊబకాయం, మూర్చరోగం, కీళ్లవాతం, జ్వరం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గడానికి చక్కటి ఆహారం. కొర్ర బియ్యంలో 12.3గ్రాములు ప్రోటీన్ 4.3గ్రా ఫ్యాట్, 3.3గ్రా మినరల్స్, 8గ్రా ఫైబర్, 60.9 గ్రా కార్పోస్, 31మి.గ్రా. క్యాల్షియం, 2.8గ్రా. ఐరన్ ఉంటుంది.
రాగులు (చోళ్లు, తైదలు)
ఎముకుల దృఢత్వం, రక్తహీనత, జీర్ణశక్తిని రాగులు పెంచుతుంది. బాలింతల్లో పాల ఉత్పత్తికి, ఊబకాయ నివారణకు, మలబద్ధకానికి పేగు క్యానర్స్ బారిన పడకుండా కాపాడుకోవడానికి రాగులు చక్కని ఆహారం. రాగుల్లో 7.3గ్రా ప్రొటీన్, 1.3గ్రాముల ఫ్యాట్, 2.7గ్రా మినరల్స్, 3.6గ్రా ఫైబర్, 73గ్రా కార్పోస్, 34.4గ్రా క్యాల్షియం, 3.9 ఐరన్ ఉంటాయి.
ఊదలు
గర్భిణులు, బాలింతలకు ఊద బియ్యం బలవర్ధకమైన ఆహారం. శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం, మధుమేహం, చిన్న పేగులో వచ్చే పుండు, క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాలేయ సమస్యలు నివారించి, కిడ్నీ పనితీరును మెరుగుపర్చుతుంది. శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్లకు ఈ బియ్యం చాలామంచి ఆహారం. ఊద బియ్యంలో 6.7గ్రామ ప్రొటీన్, 2.2 ఫ్యాట్, 4.4గ్రా మినరల్స్, 3.8 ఫైబర్, 65.5 కార్పోస్, 11మి.గ్రా. క్యాల్షియం, 18.6 ఐరన్ ఉంటాయి.
వరిగలు
వరిగల బియ్యంలో లిసితిన్ పుష్కలంగా ఉండడంతో నరాల పటుత్వానికి మంచి ఆహారం. మూత్రాశయ వ్యాధులకు చక్కగా పనిచేస్తుంది. మూత్రంలో మంట, రక్తం పడడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మ సంబంధ వ్యాధులు, ఎముకల్లో పటుత్వానికి, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా, హృదయ రోగాలు, క్యాన్సర్ వంటి రోగాల నివారణకు ఉపయోగపడుతాయి. వరిగల బియ్యంలో 12.5 గ్రా ప్రోటీన్, 3.1 ఫ్యాట్, 1.9 మినరల్స్, 7.2ఫైబర్, 70.4 కార్పోస్, 14మిల్లీ గ్రాముల క్యాల్షియం, 2.9 ఐరన్ ఉంటాయి.
పిల్లలకు చిరుధాన్యాలు ప్రయోజనకరం
పిల్లలకు ఆరుమాసాలు దాటిన దగ్గర నుంచి చిరుధాన్యాలు తినిపించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జావ రూపంలో చేసి పిల్లలకు అందించవచ్చు. ముఖ్యంగా రాగులు, జొన్నలు, సజ్జలు ఎండబెట్టి మాల్ట్లాగా చేసి ఇవ్వవచ్చు. జొన్నలు, సజ్జలు పేలాలుగా చేసుకొని వేపిన ఇతర చిరుధాన్యాలతో కలిపి పొడి చేసుకుని, జావలాగా చేసుకొని దానికి అకుకూరలు, పప్పుధాన్యాలు, కూరగాయలు కలిపి పిల్లలకు తినిపిస్తే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవుతారు.