కాంగ్రెస్ నాయకులు మోసపూరితమైన మాటలతో ఓట్లు వేసుకునేందుకు చూస్తున్నారని, ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ బీఆర్ఎస్ ఆభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని 9, 11, 26, 27వ వార్డుల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని తెలిపారు. చుట్టపు చూపుగా వచ్చే నాయకులను నమ్మవద్దని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 22: చుట్టపు చూపుగా వచ్చే నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఎన్నికల్లో ఆలోచించి ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మెదక్ బీఆర్ఎస్ ఆభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 9, 11, 26, 27వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆయా వార్డుల కౌన్సిలర్లు మేడి కల్యాణి, జయశ్రీ, రుక్మిణి, సమియోద్దిన్, యశోధ, శేఖమ్మలతో కలిసి ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మోసపూరితమైన మాటలతో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారన్నారు. ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనన్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి, సంక్షేమం ముందుకు సాగడానికి సాధ్యం అవుతుందన్నారు. అన్ని వర్గాలు, కులమతాలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలన్నారు. పదేండ్లలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజా ఆశీర్వదమే తనకు కొండంత బలమన్నారు. ఈ ప్రాంత ఆడబిడ్డగా ప్రజల కష్టాసుఖాలు తనకు తెలుసన్నారు. ఆపదలో అండగా నిలుస్తున్నానని, తనను పదేండ్ల చిన్న పిల్లోడు నుంచి వందేండ్ల పెద్దవాళ్ల కూడా అక్కా అని ఆప్యాయంగా పిలుస్తున్నారన్నారు. అదే అప్యాయతతో దీవించాలని కోరారు. గత పాలకుల నిర్లక్ష్యంతో మెదక్ పట్టణం అభివృద్ధిలో ఎంతో వెనుకబడి పోయిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పట్టణ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మాత శిశు సంరక్షణ దవాఖాన, రైల్వే, పట్టణంలో రోడ్ల విస్తరణ, మురుగు కాల్వల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతా, చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు పంటలకు మూడు గంటలే కరెంట్ సరిపోతదని, మరో నాయకుడు ఉత్తమ్ కుమార్రెడ్డి రైతుబంధు నిలిపి వేయాలని అంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదన్నారు. వారంటీ లేని గ్యారెంటీలు ప్రకటించే పార్టీలను నమ్మవద్దన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి మరోసారి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయా వార్డుల్లో పద్మాదేవేందర్రెడ్డిని డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలుకుతూ ఇంటింటా మంగళహారతులతో పసుపు, కుంకుమలు ఇస్తూ ఆశీర్వదించారు. మరికొందరు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు తినిపించి దీవెనలందించారు. 26వ వార్డులో వార్డు కౌన్సిలర్ గడ్డమీది యశోధ పద్మాదేవేందర్రెడ్డిని వార్డు ప్రజలతో కలిసి గజమాలతో సన్మానించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధార్, గడ్డమీది కృష్ణాగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మధుసూదన్రావు, పెర్క కిషన్, అంకం చంద్రకళ, నాయకులు లింగారెడ్డి, ప్రభురెడ్డి, బోద్దుల కృష్ణ, దుర్గాప్రసాద్, మేడిశెట్టి శంకర్, శివరామకృష్ణ, కిరణ్, అరుణ్, ప్రసాద్, కొండ శ్రీను, జుబేర్, ఉమర్, సంగ శ్రీకాంత్, ముజీబ్, చందురాషా, పాపయ్య, ముకుంద్ యాదవ్, నగేశ్, బాలరాజ్, శ్రీకాంత్రెడ్డి, జెల్ల రమేశ్, సత్యనారాయణరెడ్డి, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.