HomeMedakPublic Representatives And Officials Inspecting The Camps
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న కంటివెలుగు కార్యక్రమం
కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఉచితంగా అద్దాలు
శిబిరాల వద్ద ఉదయం నుంచే జనం బారులు
ఇప్పటి వరకు 4,32,786 మందికి నేత్ర పరీక్షలు
శిబిరాలను తనిఖీ చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
66,856 మందికి రీడింగ్, 3,369 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేత
సిద్దిపేటలో 67, మెదక్లో 103, సంగారెడ్డి జిల్లాలోని 79 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి
సిద్దిపేటలో 1,13,271 మంది, మెదక్లో 88,430 మంది,సంగారెడ్డి జిల్లాలో 2,31,085 మందికి కంటి పరీక్షలు
కంటివెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రభుత్వం ఉచితంగా అద్దాలు, మందులు అందజేయడంతో పాటు ఆపరేషన్లు చేయిస్తుండడంతో కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. ఉదయం నుంచే శిబిరాల వద్ద జనం బారులు తీరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు శిబిరాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అమలు తీరును పరిశీలిస్తున్నారు. శిబిరాల వద్ద టెంట్లు, తాగునీటి వసతి వంటి సౌకర్యాలు కల్పించారు. ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 4,32,786 మందికి కంటి పరీక్షలు చేశారు. నేత్ర పరీక్షలు నిర్వహించిన వెంటనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అవసరమైన వారికి రీడింగ్ గ్లాస్లు అందజేస్తున్నారు. ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తిస్తున్నారు. వివిధ సమస్యలతో శిబిరాలకు వచ్చిన వారు పరీక్షలు చేయించుకొని.. మందులతో పాటు కళ్లజోళ్లు అందుకొని సంతోషంగా వెళ్తున్నారు.
– సిద్దిపేట, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత ‘కంటి వెలుగు’కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ ఖమ్మంలో కంటి వెలుగును ప్రారంభించగానే జనవరి 19వ తేదీ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీ రు హరీశ్రావు ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. కంటి వెలుగు శిబిరాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఊరిలో.. ఏవార్డు లో నిర్వహించేది ముందే ప్రజలకు తెలియజేస్తూ భారీగా ఫ్లెక్సీలు, టాంటాం ద్వారా విస్తృత ప్రచా రం చేస్తున్నారు.
కంటి వెలుగు పండుగ వాతావారణంలో కొనసాగుతున్నది. సిద్దిపేట జిల్లాలో 45 బృందాలు ఏర్పాటు చేశారు. 499 గ్రామ పంచాయతీలకు 67 గ్రామాల్లో , మున్సిపాలిటీల్లోని 26 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తిచేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,13, 271మందికి కంటి పరీక్షలు చేసినట్లు జిల్లా వైద్యాధికారి కాశీనాథం తెలిపారు. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల్లో 40 బృందాలు శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 88,430మందికి, సంగారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 199 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు 79 గ్రామాలు, 29 వార్డుల్లో 2,31,085 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 16 రోజుల్లో 4,32,786 మందికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి రీడింగ్, ప్రిస్క్రిప్షన్ అద్దాలు అందజేశారు.
సిద్దిపేట జిల్లాలో 1,13,271..
సిద్దిపేట జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయడంతో జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో క్ష్రేతస్థాయిలో మంత్రి హరీశ్రావు కంటి వెలుగు శిబిరాలను సందర్శించారు. జిల్లాలో 45 బృందాలతో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 67 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేయగా.. మరో 35 గ్రామాల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల్లో 26 వార్డులు పూర్తి చేయగా మరో 10 వార్డుల్లో కంటివెలుగు శిబిరాలు నడుస్తున్నాయి. వారంలో ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,13,271 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో పురుషులు 52,856 మంది, మహిళలు 60,376 మంది ఉన్నారు.
ఎస్సీలు 19,227, ఎస్టీలు 2,831, బీసీలు 76,324, ఓసీలు 12,319 మంది కాగా మైనార్టీలు 2,546 మందికి కంటి పరీక్షలు చేసి 25,502 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు. కంటి అద్దాలు తీసుకున్న వారిలో 40 ఏండ్లలోపు వారు 2,755 మంది, 40 ఏండ్ల పైబడిన వారు 22,731 మంది ఉన్నారు. ఇక ప్రిస్క్రిప్షన్ అద్దాలు 18,997 మందికి అవసరం అని గుర్తించారు. వీరిలో 856 మందికి నేరుగా వారి ఇంటికి పంపించారు. మిగతా 18,141 మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంటి వెలుగు శిబిరాల్లో ఎలాంటి కంటి సమస్యలు లేని వారిని 68,772 మందిని గుర్తించారు.
మెదక్ జిల్లాలో 88,430 మందికి..
మెదక్ జిల్లాలో కంటి వెలుగు శిబరాలు పండుగ వాతావారణంలో కొనసాగుతున్నాయి. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటి వరకు 103 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. మరో 30 గ్రామాల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల్లోని 19 వార్డుల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 88,430 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వీరిలో పురుషులు 41,379 మంది, 46,937మంది మహిళలు, 22 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎస్సీలు 12,797, ఎస్టీలు 10,533, బీసీలు 59,419, ఓసీలు 4,363, మైనార్టీలు 1,226 మంది ఉన్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 12,528 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. వీరిలో 40 ఏండ్లలోపు వారు 2,042 మంది, 40 ఏండ్ల పై బడిన వారు 10,440 మంది ఉన్నారు. ఇక ప్రిస్క్రిప్షన్ అద్దాలు 12,104 మందికి అవసరం కాగా ఇప్పటి వరకు 1,541 మందికి అందజేశారు. మిగతా వారికి త్వరలోనే అందించనున్నారు. 63,794 మందిని ఎలాంటి కంటి సమస్యలేని వారిగా గుర్తించారు.
సంగారెడ్డి జిల్లాలో 2,31,085 మంది..
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 79 గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేశారు. మరో 48 గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీల్లోని 29 వార్డులు పూర్తి చేయగా మరో 21 వార్డుల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 2,31,085 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో పురుషులు 1,09 ,505 మంది, మహిళలు 1,21,542 మంది, ట్రాన్స్జెండర్లు 17 మంది ఉన్నారు. ఎస్సీలు 37,847 మంది, ఎస్టీలు 14,383 మంది, బీసీలు 1,40,972 మంది, ఓసీలు 17,132 మంది కాగా మైనార్టీలు 20,730 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
కంటి పరీక్షల అనంతరం 28,826 మందికి రీడింగ్ కంటి అద్దాలు పంపిణీ చేశారు. వీరిలో 40 ఏండ్లలోపు వారు 5,879 మంది, 40 ఏండ్ల పైబడిన వారు ఉన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరం అని 22,283 మందిని గుర్తించారు. కాగా వీరిలో ఇప్పటి వరకు 972 మందికి ఇంటి వద్దకు వెళ్లి కంటి అద్దాలు అందించారు. మిగతా వారికి త్వరలోనే అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జిల్లాలో కంటి పరీక్షలు చేసిన వారిలో ఎలాంటి కంటి సమస్య లేదని గుర్తించిన వారి సంఖ్య 1,79,976 మంది ఉన్నారు.