న్యాల్కల్, మార్చి 13: మండలంలో ఏడాదిపాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ నిర్వహించారు. అడిషనల్ డీఆర్డీవో బాలరాజ్ ఆధ్వర్యంలో 14వ బహిరంగ విచారణ కొనసాగింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.3.9 కోట్లతో నిర్వహించిన ఉపాధి హామీ పనులకు సంబంధించి వారం రోజులపాటు తనిఖీలు, గ్రామసభలు నిర్వహించినట్లు స్టేట్ రీసోర్స్పర్సన్ స్వామి తెలిపారు. గ్రామాల వారీగా నమోదు చేసుకున్న వివరాలను డీఆర్పీలు బహిరంగ విచారణలో వెల్లడించారు.
ఇందులో పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో నిర్లక్ష్యం వల్ల అనుకున్న మేర లక్ష్యం నెరవేరలేదు. డిమాండ్ పెట్టిన పనులు చూపించకపోవడం, పనులు లేనప్పుడు నో డిమాండ్ ఇవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరూ ఉపా హామీ పనులు చేపట్టారని, దరఖాస్తు చేసుకున్న వారికి జాబ్కార్డులు ఇవ్వకపోవడం, బిల్లు చెల్లించడంలో పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం, పొలాల్లో నాటిన టేకు మొక్కలు జాడలేకపోడం, అవెన్యూ, కమ్యూనిటీ ఫ్లాంటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం ఫలితంగా సర్వైవల్ రేటు తగ్గిపోవడం తదితర అంశాలను అడిట్ బృందం గుర్తించింది. రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడం, ఫొటోలు నిర్వహణ చేయకపోవడం, కూలీలకు పేస్లిప్లు ఇవ్వకపోవడం వంటివి కూడా ఉన్నాయి.
ఇవన్నీ విధుల నిర్లక్ష్యంలో భాగంగా గుర్తించిన పలువురు పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, మేట్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడమే కాకుండా జరిమానాలు విధించారు. అనంతరం అడిషనల్ డీఆర్డీవో బాలరాజ్ మాట్లాడుతూ మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ సక్రమంగా ఉండాలని, మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నర్సరీలో మొక్కలకు సరిపడా నీరు అందించి ఎండిపోకుండా గ్రీన్ షేడ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవెన్యూ, కమ్యూనిటీ ఫ్లాంటేషన్ చేపట్టిన మొక్కలు ఎండిపోకుండా నీరుపోసి సంరక్షించాలన్నా రు.
ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా జాబ్కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ పని కల్పించి, కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొలతల ప్రకారం నాణ్యతవంతంగా పనులు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏవీవో నాగేశ్వర్రావు, ఫ్లాం టేషన్ మేనేజర్ మణికుమార్, అంబుడ్మేన్ బోజిరెడ్డి, ఎంపీడీవో సురేశ్, ఈజీఎస్ ఏపీవో రంగారావు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ పథకం టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు.