చేర్యాల, జూన్ 23 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శుక్రవారం బహిరంగ వేలం పాటలు ఆలయ ఈవో అలూరి బాలాజీ ఆధ్వర్యంలో సిద్దిపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో విశ్వనాథశర్మ పర్యవేక్షణలో జరిగాయి. టెండర్లలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల మొబైల్ ఫోన్లు భద్రపర్చే టెండరులో రూ. 20,06,000 పాటను పాడి ఎదుల కనకయ్య అనే వ్యక్తి లైసెన్స్ హక్కులను పొందారు.
పాదరక్షలు భద్రపర్చే టెండరును పి.నవీన్ అనే వ్యక్తి రూ.13,55,000కు దక్కించుకున్నాడు. ఎల్లమ్మ ఆలయం వద్ద కూల్డ్రింక్స్, పూజసామగ్రి విక్రయించుకునే హక్కులను రూ.6,07,000లకు పాటను పాడి సనాది వెంకటేశ్ అనే వ్యక్తి పొం దాడు. ఎల్లమ్మ ఆలయం వద్ద ఒడిబియ్యం, వస్ర్తాలు, కొబ్బరి ముక్కలు సేకరించే టెండరును రూ.16,05,000కు మల్లం నవీన్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ప్రసాదాల తయారీ హక్కులు (లడ్డూ, పులిహోర, సిరా) గతేడాది కంటే తక్కువకు పాటను పాడిన కె.నరేశ్కు అప్పగించారు. మల్లన్నక్షేత్రంలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహణ హక్కుల టెండరును రూ.4,41వేలకు నిర్వాహకుడు రంజిత్మిశ్రా దక్కించుకున్నారు. గతేడాది కన్నా మొబైల్ ఫోన్ల భద్రపర్చే హక్కులకు రూ. 8లక్షల79వేలు, పాదరక్షలకు రూ.8.20లక్షలు అధికంగా వచ్చాయి.
మల్లన్న ఆలయంలో వస్ర్తాలు, ఒడిబియ్యం, పసుపు, కొబ్బరి ముక్కలు సేకరణ హక్కుల కోసం నిర్వహించిన టెండరులో వ్యాపారుల నుంచి సరైన పాట రాకపోవడంతో ఆలయ ఈవో టెండరును రద్దు చేశారు. తలనీలాల హక్కులను అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. రద్దు చేసిన హక్కులను తిరిగి జూలై 4వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలం పాటలో సిద్దిపేట వేంకటేశ్వరస్వామి ఆలయ ఈవో విశ్వనాథశర్మ, జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, ఆలయ డైరెక్టర్లు నర్ర రఘువీరారెడ్డి, నామిరెడ్డి సౌజన్య, సూటిపల్లి బుచ్చిరెడ్డి, కొంగరి గిరిధర్, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ పాల్గొన్నారు.