న్యాల్కల్, డిసెంబర్ 17: పండ్లలో రాజు మామిడి. అందుకే వేసవిలో వచ్చే మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో చాలామంది రైతులు మామిడి సాగుకు ఆసక్తి చూపుతుంటారు. నాణ్యమైన మామిడి పండ్లకు దేశీ అవసరాలతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండడంతో మంచి ఆదాయాన్ని రైతులకు తెచ్చి పెడుతున్నది. అధిక దిగుబడి, నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్, హుస్నాబాద్, నర్సాపూర్, తూప్రాన్ ప్రాంతాల్లో సుమారు 2000 ఎకరాల్లో మామిడి తోటలు సాగుచేస్తున్నారు.
ప్రాంతాన్ని బట్టి పలు రకాల మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపుతారు. బంగినపల్లి, తోతాపురి, చిన్నరసం, పెద్దరసం, చెరుకు రసం వంటివి అన్ని ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. వీటితోపాటు కేసరి, సువర్ణరేఖ, దశేరి వంటివి కూడా ఉన్నాయి. సంకర జాతి రకాల విషయానికొస్తే ఇందులో ముఖ్యంగా అమ్రపాలి, రత్న, ఆర్కా, పునీత్, సింధు వంటి రకాలు ఉన్నాయి. మామిడి సాగులో రైతులు తగు జాగ్రత్తలు పాటిస్తే అధిగ దిగుబడులు సాధించొచ్చు. పూత సమయంలో అకుపచ్చ, పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు ఆశిస్తాయి. వీటిని నివారించేందుకు ఉద్యాన వన అధికారులు, నిపుణులు సూచించిన మందులతో పిచికారీ చేస్తే మంచిది. మొక్క తొలి దశలో ఉన్నప్పుడు మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి నీరు పెట్టుకోవాలి. పూత, పిందెలు కాసే దశలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సిన అవసరం. చెట్ల పొదల్లో ఎండు గడ్డి, ఎండిన ఆకులు, కొబ్బరి బోండాలు లాంటివి వేసి కప్పి ఉంచాలి. దీంతో కలుపు మొక్కల నివారణ ఈజీగా ఉంటుంది. మొక్కలకు తగినంత తేమ అందుబాటులో ఉంటుంది. వాతావరణ పరిస్థితులను బట్టి మొక్కలకు ఎరువులు అందించాలి. మామిడి తోటల్లో ప్రధానంగా జింక్ లోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని నివారణకు లీటరు నీటిలో 5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇనుప ధాతు లోపం వచ్చినట్లయితే ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. దీని నివారణకు 2.5 గ్రా. పెర్రస్ సల్ఫేటీ లీటర్ నీటిలో కలిపి పచికారీ చేసుకోవాలి. మామిడి తోటలో కలుపు సమస్యను నివారించేందుకు పారాసల్ఫేట్ 8 మీ.లీ లేదా అమోనియం సల్ఫేట్ 20 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. మామిడి మొక్కలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల కొమ్మల ఆకులతో సరైన సూర్యరశ్మి చెట్లకు అందక పండ్లని తయారు చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. సీఏచర్, లాఫర్ వంటి పరికరాలు ఉపయోగించాలి. మామిడి పూతలో ప్రతి పూల గుత్తిలో 4- 6 వేల వరకు పూలుంటాయి. ఇందులో 1- 3 పూలే కాయగా వృద్ధి చెందుతాయి. మామిడి తోటల్లో పూత, మొగ్గ ఏర్పడిన తరువాత పై పాటుగా ఎరువులు వేసుకోవాలి. చెట్టు వయసు బట్టి సాధారణంగా 500 గ్రాముల నుంచి ఒక కిలో యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేపపండితో కలిపి వేయాలి. అలా వేసిన తరువాత 15 రోజుల వ్యవధిలో తడులివ్వాలి. పిందె కట్టిన నాటి నుంచి కాయ కోత వరకు అనేక కారణాలతో మూడు దశల్లో పిందెలు, కాయలు రాలుతుంటాయి. పిందెలు రాలకుండా ఉండేందుకు చెట్లకు 20-30 రోజుల వ్యవధిలో రెండు, మూడుసార్లు నీటి తడులివ్వాలి. సాగునీటి సౌకర్యం లేనివారు యూరియా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. పిందే రాలుడు ఉధృతి ఎక్కవగా ఉంటే 4.5 లీటర్ల నీటిలో 1 మి.లీ ఫ్లానోపిక్స్ కలిపి పిచికారీ చేసుకుంటే మంచిది.
బూడిద తెగుళ్లు.. : మామిడి తోటలో బూడిద తెగుళ్లు ఆశిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని కోసం నీటిలో కరిగే రెండు గ్రాముల గంధకం లేదా ఒక మిల్లీ లీటర్ కెరాథెన్ లేదా ఒక గ్రాము మైకోబ్యూటనిల్ లేదా ఒక గ్రాము బేరిటాస్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి పదిహేను రోజుల తర్వాత మార్చి పిచికారీ చేయాలి.
మచ్చ తెగుళ్లు.. : మామిడి తోటలో ఎండిపోయిన కొమ్మల్ని వెంటనే తీసివేయాలి. వాటిని లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి పూత సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
మామిడి సాగులో తగు జాగ్రత్తలు పాటిస్తే అధిగ దిగుడులు సాధించవచ్చు. ముఖ్యంగా పూత సంరక్షణలో వాతావరణ పరిస్థితులు, నీటి, పోషక యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల బెడద, హార్మోన్ల లోపాలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఎలాంటి సమస్యలున్నా మామిడి రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించాలి. మామిడి తోటలు సందర్శించి సలహాలు, సూచనలు అందిస్తాం.
చలికాలంలో మామిడి తోటల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చలి తీవ్రత పెరిగే కొద్ది మామిడి పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించాలి. దీంతో అధిక దిగుడులు సాధించొచ్చని ఉద్యాన అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. మామిడి సాగు రైతులు పూతకు ముందు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పూత ఆలస్యంగా వస్తుంటుంది. కొమ్మలు కత్తిరించడం, దున్నడం చేయకుండా మామిడి తోటలకు విశ్రాంతి ఇవ్వాలి. దీంతో పూత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది రైతులు పూతకు ముందు కొమ్మల కత్తిరింపు, దున్నడం వంటివి చేస్తుంటారు. ఇలా చేస్తే పూత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పూత, పిందె, కాయలు కాసే సమయంలో తెగుళ్లు, చీడపీడల నివారణ చర్యలు చేపడితే మంచిదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
తేనె మంచు పురుగు : మామిడి సాగులో ఆశించే తేనె మంచు పురుగు నివారణకు లీటరు నీటిలో ఫాస్పామిడాన్ 0.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీ లీటర్లు లేదా కార్సరిల్ 3 గ్రాములు లేదా డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లతో కలిపి చెట్టుకు పూత, పిందె వచ్చే సమయంలో పూత, ఆకులపై కాకుండా మొదళ్లో పిచికారీ చేయాలి. పూలు పూర్తిగా విచ్చుకోక ముందు పిచికారీ చేయాలి. పూత బాగా ఉన్నప్పుడు పిచికారీ చేస్తే పుప్పొడి రాలిపోయి పరాగ సంపర్కానికి తోడ్పాటే కీటకాలు మరణిస్తాయి. ఇక మొగ్గ దశలో కనిపించిన సమయంలో 3 గ్రాముల ఎడల కార్భరిల్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మీల్లిలీటర్, ఒక గ్రాము కార్బడిజమ్ను లీటర్ నీటిలో కలిపి వెంటనే పిచికారీ చేయాలి. ఆక్లారా 0.1 మిల్లీ లీటర్ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇలా చేస్తే పూత కాపు సమయంలో తేనె మంచు పురుగును సమర్థవంతగా నివారిస్తుంది. కాయపుచ్చు పురుగు.. : గులాబీ రంగు చారతో తెల్లటి లద్దె పురుగు మామిడి కాయ అడుగున రంధ్రం చేసి తోలును కండను తిని సొరంగాన్ని ఏర్పరుస్తుంది. కాయ లోపలి భాగం పూర్తిగా తినేస్తుంది. ఒక కాయలో 8 పురుగులు ఉంటాయి. దీని నివారణకు వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. పురుగు కోశస్థ దశ, ఎండు పుల్లలు, బెరుడు గడుపుతుంది. ఎండిపోయిన మామిడి బెరడును చెట్టు నుంచి తొలిగించాలి. అత్యవసర స్థితిలో సైపర్ మెత్రిన్ 2 ఇసి.0.5 మి.లీ. లీటర్ నీటిలో కలిపి పూత, పిందెపై పిచికారీ చేయాలి.
పిండినల్లి పురుగు.. : పిండినల్లి పురుగు కాయ లేత కొమ్మల నుంచి రసాన్ని పీల్చి చెట్టును బలహీన పరుస్తుంది. ఇవి విసర్జించిన తేనె వంటి జిగురైన మసి తెగుళ్లు వృద్ధి చెంది పండు నాణ్యత తగ్గుతుంది. ఈ తేనె వంటి పదార్థం కోసం చీమలు వస్తాయి. డిసెంబర్, జనవరిలో చెట్టుకు కాండం, మొదలు చుట్టు ఫాలథిన్ పేపర్ అడుగు వెడల్పులో కట్టాలి. లేదా జిగురు పూసి పిల్లిపురుగు పైకి పాకకుండా ఆపవచ్చు. చెట్టు చుట్టూ వేసవిలో పాదు చేయాలి. దీని నివారణకు క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లేదా మిథైల్ ఏడెమటాన్ 2 మి.లీ. లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదలు కొమ్మలతో సహ పిచికారీ చేయాలి.
టెంకు పురుగు.. : తోతాపురి, నీలం మామిడి రకాల్లో టెంకు పురుగు ఎక్కువగా కనిపిస్తుంది. తోటలో రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. కాయ చిన్న సైజులో ఉండగా 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పెంధియాన్ 1మి.లీ. లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం, బెరడును తొలిచే పురుగు పాడైపోయిన కొమ్మలను తొలిగించడంతో దీన్ని నివారించుకోవచ్చు. బెరడులో పురుగులు ఉన్నట్లయితే ఇనుప చువ్వల ద్వారా వాటికి బయటకు తీసి చంపివేయాలి. ఆ రంధ్రాల్లోకి లీటర్ నీటికి 10 మి.లీ డైక్లోరోఫాస్ లేదా మోనోక్రోటోఫాస్ కలిపి రంధ్రంలో పోసి బంకమట్టితో మూసివేయాలి.
చెదపురుగు.. : మామిడి చెట్లకు ఎర్రనేలలు, ఇనుప నేలలు, మెట్టభూముల్లో చెదలు ఎక్కువగా పడుతుంది. ఇవి వేళ్లు, బెరడును ఆశించడంతో చిన్న మొక్కలు చనిపోతాయి. పెద్ద కొమ్మలు బలహీనపడుతాయి. నీటి ఎద్దడి ఉన్నప్పుడు సైతం వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. కొత్తగా మొక్కలు నాటే సమయంలో గుంతకు మట్టిలో అర కిలో వేప పిండి లేదా 100 గ్రా. పాలిడాల పొడిని కలిపాలి. చెద ఉన్న స్థలాన్ని గుర్తించి రాణి పురుగుతో సహ నాశనం చేయాలి. చెదలు ఆశించిన కాండంపై మట్టి పొరను తొలిగించి క్లోరోఫైరిపాస్ పిచికారీ చేయాలి.