సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 23: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 55 మంది అర్జీదారులు ఫిర్యాదులను అందజేశారు. సంగారెడ్డి కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. సమస్యల పరిష్కారం క్షేత్రస్థాయి నుంచి జరిగితే త్వరితగతిన పూర్తవుతాయన్నారు. ఇదిలా ఉండగా ప్రజావాణికి అందిన 55 అర్జీల్లో 30 అర్జీలు రెవెన్యూ సంబంధిత సమస్యలు కాగా, మిగతావన్నీ డబుల్ బెడ్ రూమ్, పింఛన్ తదితర సమస్యలకు సంబంధించిన ఉన్నాయి. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.