పటాన్చెరు/ అమీన్ఫూర్/ బొల్లారం, మార్చి 5: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని పటేల్గూడ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని మాట్లాడారు. ప్రధాన మోదీ ప్రసంగం సందర్భంగా ప్రజలు, పార్టీ నాయకులు, యువకులు మోదీ మోదీ అంటూపెద్ద నినాదాలు చేశారు. ప్రధాని మోదీ విజయ సంకల్పయాత్ర సభను లక్ష మందితో నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. తీరా ఏర్పాట్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. ప్రధాని మోదీ ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నా, ఆ స్థాయిలో ప్రజలు రాకపోవడంతో బీజేపీ నేతల్లో నిరాశ కనిపించింది. ఒకవైపు ప్రధాని ఒక్కో మాటకు సభికులు కేరింతలు కొట్టారు. మరోపక్క వెనుకభాగంలో వేసిన కుర్చీలు ఖాళీగా ఉండడం బీజేపీ నాయకులకు మింగుడు పడలేదు. వచ్చిన ప్రజలు ప్రధాని ప్రస్తావించిన అంశాలపై స్పందించారు. ఆర్టికల్ 370, రామమందిరం ప్రస్తావన వచ్చిన సమయంలో బీజేపీ వర్గాల్లో జోష్ కనిపించింది. జైశ్రీరాం నినాదాలతో యువకులు నృత్యాలు చేశారు.
సభకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని బీజేపీ దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు పలుమార్లు ఆరోపించారు. తెలంగాణ పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం తగదని వేదికపై నుంచి ఆయన పేర్కొన్నారు. జీఎమ్మార్ ఫంక్షన్హాల్ వద్ద, కిష్టారెడ్డిపేట రూట్లో, ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై పోలీసుల తీరుతో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు భద్రతా చర్యల పేరిట ప్రజలకు తాగునీటి బాటిల్స్, పెన్నులు సైతం తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. బహిరంగ సభలోనూ తీవ్రమైన ఆంక్షలు పెట్టడంతో సభకు వచ్చిన వారు చాలామంది వెనుదిరిగినట్టు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పోలీసుల తీరుతో ప్రజలు సరైన సమయానికి వేదిక వద్దకు రాలేకపోయారని బీజేపీ నాయకులు ఆరోపించారు. జన సమీకరణలో విఫలం కావడంతో జిల్లా నాయకత్వంపై రాష్ట్ర నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు ఈటల రాజేందర్, రఘునందన్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడారు. సభలో ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.