మెదక్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మెదక్ రైల్వేస్టేషన్ ఎంపికైంది. దేశంలోని 500 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా మెదక్ రైల్వేస్టేషన్కు కూడా స్థానం దక్కడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం కేంద్రం రూ. 15.29 కోట్లు కేటాయించింది. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, స్టేషన్లో స్వచ్ఛత పాటించడం, ప్రయాణికుల వెయిటింగ్ హాల్స్, టాయిలెట్స్, ఉచిత వైఫై సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
స్టేషన్ ముందు, వెనుక భాగాల్లో మొక్కల పెంపకం, చిన్నపాటి పార్కులు, స్టేషన్లో బిజినెస్ మీటింగ్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అవసరమైన నిర్మాణాలు చేపట్టడం, పట్టణానికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేయడం, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, సుస్థిర పర్యావరణ అనుకూల పరిష్కారాలు, పట్టాలకు ఇరువైపులా కాంక్రిట్ బాటలు, రూఫ్ ప్లాజాలు, ఇతర సౌకర్యాలను కల్పిస్తారు. ఈ నెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా 40 స్టేషన్లను ఒకేసారి ఆన్లైన్ ద్వారా ప్రారంభించనున్నారు.