పరిశ్రమల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలతో భారీగా ఆస్తినష్టం సంభవిస్తుండడంతో పాటు ప్రాణనష్టం కూడా అధికంగానే ఉంటుంది. యాజమాన్యాలు నిబంధనలు పాటించకపోవడం.. భద్రతాప్రమాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఇందుకు కారణం. నగరానికి ఆనుకుని ఉన్న సంగారెడ్డి జిల్లా పరిశ్రమలకు కేరాఫ్గా మారింది. మొత్తం 4,306 పరిశ్రమల్లో 1,91,676 మంది కార్మికులు పనిచేస్తుండగా, వీరిలో తెలుగు రాష్ర్టాలతోపాటు బీహార్, గుజరాత్, ఒరిస్సా తదితర రాష్ర్టాలకు చెందిన వారు ఉన్నారు.ముఖ్యంగా పటాన్చెరు, జిన్నారం, ఐడీఏ బొల్లారం, కంది, హత్నూర, సదాశివపేట తదితర మండలాల్లో భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో తరచూ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరుగుతుండడంతో వీటిని నివారించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ హనుమంతరావు రెండు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 12 పరిశ్రమల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశాయి. ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేశాయి.
సంగారెడ్డి కలెక్టరేట్, మే 18: పరిశ్రమల్లో రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలో మొత్తం 4,306 పరిశ్రమలు ఉండగా, అందులో 160 భారీ, అతిభారీ పరిశ్రమలు కాగా, 192 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో పని చేస్తున్న 1,91,676 మంది కార్మికుల జీవితాలను కాపాడుకోవాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న రసాయన పరిశ్రమలపై ప్రత్యేక దృష్టిని సారించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి ఆయా పరిశ్రమల్లో తనిఖీలు చేపడుతున్నారు. తొలుత రసాయన పరిశ్రమలను తనిఖీ చేసి అక్కడ ఉన్న భద్రతా వ్యవస్థ, యాజమాన్యాలు పాటిస్తున్న నిబంధనలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 12 పరిశ్రమల్లో తనిఖీలు చేసిన బృందాలు తమ నివేధికలను ఉన్నతాధికారులకు అందజేశారు.
సంగారెడ్డి జిల్లా అనగానే గుర్తుకొచ్చేవి పరిశ్రమలు. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉండడంతో జిల్లాలో పారిశ్రామిక ప్రాంతం ఇప్పటికే చాలా వర కు విస్తరించింది. ముఖ్యంగా పటాన్చెరు, జిన్నారం, ఐడీఏ బొల్లారం, కంది, హత్నూర, సదాశివపేట తదితర మండలాల్లో భారీ పరిశ్రమలున్నాయి. ఇటీవల అనేక పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం, పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదాలతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరుగుతున్నది. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా తమ ప్ర ణాలకు ముప్పుపొంచి ఉన్నదని అనేక పరిశ్రమలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు వాపోతున్నారు. అయితే అతిగా ప్రమాదాలు జరిగే వాతావరణంలో దూర రాష్ర్టాలైన బీహార్, గుజరా త్, ఒరిస్సా తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులనే ఎక్కువగా నియమిస్తారనే ఆరోపణలూ లేకపోలేవు. తర చూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలపై కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. జిల్లాలోని పరిశ్రమల్లో కొంతైనా ప్రమాదాలను ని వారించాలనే ఉద్దేశంతో ఆయా పరిశ్రమలను తనిఖీ చేసేందుకు నిర్ణయించారు. సంబంధిత శాఖల అధికారులను ఒక బృం దంగా ఏర్పాటు చేస్తూ రెండు బృందాల నియమించారు. ఈ రెండు బృందాలు జిల్లాలోని అన్ని పరిశ్రమలను తనిఖీ చేయనున్నాయి.
రసాయన పరిశ్రమలో తనిఖీ చేస్తున్న బృందాలు, అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రదర్శన ఇస్తున్న అగ్ని మాపక సిబ్బంది
రసాయన పరిశ్రమలతోనే మొదలు..
ఇదిలాఉండగా జిల్లాలో అధికంగా రసాయన పరిశ్రమలున్నాయి. వాటిలో పేలుళ్లు చోటు చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యే పరిశ్రమలను గుర్తించి వాటిని తొలుత తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రసాయన పరిశ్రమలు, స్టీల్ యూనిట్లు, రియాక్టర్లతో కూడిన పరిశ్రమలను తొలుత తనిఖీ చేయనున్నారు. ఇప్పటికే 12 పరిశ్రమలకు సంబంధించిన తనిఖీలు పూర్తి చేశారు. పరిశ్రమల్లో ఏర్పాటు చేసిన భద్రత వ్యవస్థతో పాటు కార్మికుల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలపై కాలుష్య నియంత్ర మండలి అధికారులు దృష్టి సారించారు. ఆయా యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యల ఆధారంగా అవసరమైన సూచనలతో పాటు హెచ్చరికలను కూడా ఈ బృందాలు జారీ చేస్తున్నాయి.
బృందాల ఏర్పాటు ఇలా..
జిల్లాలోని ఆయా పరిశ్రమలను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన బృందంలో కర్మాగారాల తనిఖీ అధికారులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు, అగ్నిమాపక అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు, కార్మిక అధికారులున్నారు. జిల్లాలో మొత్తం రెండు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయి. అన్ని పరిశ్రమల్లో నిబంధనలు పాటించాల్సిందే. ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోం. ప్రభుత్వం నిర్దేశించిన సంబంధిత పరిశ్రమలు నియమనిబంధనలు పాటించి కార్మికుల శ్రేయస్సుపై దృష్టి సారించాలి. పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు తనిఖీ బృందాలకు సహకరించాలి. ముఖ్యంగా జిల్లాలోని రసాయన పరిశ్రమలు, స్టీల్ యూనిట్లు, రియాక్టర్లతో కూడిన పరిశ్రమలో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసుకోవాలి. ప్రమాదాలు లేని జిల్లాగా మార్చేందుకు ప్రతి పరిశ్రమ సహకరించాలి.
– హనుమంతరావు, కలెక్టర్ సంగారెడ్డి