సిద్దిపేట, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సెలవు దినాల్లో మినహా జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలిరోజు సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగతాచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రారంభించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సిన అధికారులు సరైన సమాధానాలు చెప్పడంలేదని తొలిరోజు ప్రజలు వాపోయారు. ప్రజాపాలనపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పైగా ఏదో మీకు నచ్చింది నింపివ్వండి అంటూ అధికారులు ముక్తసరిగా సమాధానాలు చెప్పడంతో మరింత అయోమయానికి గురయ్యారు. ఆయా గ్రామసభల్లో అధికారుల సమన్వయలోపం స్పష్టంగా కనిపించింది. బృందంలోని ఒక్కో అధికారి ఒక్కో సమాధానం చెప్పడంతో ప్రజలకు తిప్పలు తప్పలేదు. గ్రామసభకు ముందే దరఖాస్తు ఫారాన్ని ప్రతి కుటుంబానికి అందజేయాలని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఎక్కడా అది అమలు కాలేదు. కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా దరఖాస్తు ఫారాలను అందుబాటలో ఉంచలేదని ప్రజలు మండిపడ్డారు. దరఖాస్తు ఫారాలు పొందిన వారు వాటిని నింపేందుకు చాలా ఇబ్బందులుఎదుర్కున్నారు. ఒకరు ఒక రకంగా, మరో అధికారి మరోరకంగా నింపాలని సూచించారు. కొందరు లబ్ధిదారులు జిరాక్స్ చేసిన ఫారాలను నింపి ఇవ్వగా మొదట తీసుకుని, తరువాత వచ్చే లబ్ధిదారులకు ఒరిజనల్ ఫారాలు మాత్రమే తీసుకుంటామనడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ‘సరిపడా దరఖాస్తులు లేవు, వచ్చేదాక ఆగండి.. లేదంటే మీరే(లబ్ధిదారులు) కలర్ జిరాక్స్ తీసుకుని దరఖాస్తు ఫారాలు నింపి ఇస్తే మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం’ ..అని కౌంటర్ల వద్ద అధికారులు బాహాటంగానే చెప్పారు.
గ్రామసభల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, అది ఆచరణలో అమలలు కాలేదు. కొన్నిచోట్ల పేరుకు కౌంటర్లు ఉన్నా.. అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. మరికొన్ని చోట్ల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినప్పటికీ రసీదులు ఇవ్వలేదు అన్న ఫిర్యాదులు వచ్చాయి. రేపు వచ్చి రసీదులు తీసుకోండి అంటూ దాటవేశారని ప్రజలు చెప్పారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో కార్యక్రమం అభాసుపాలైంది. వేదికలపై ఎలాంటి పదవులు లేని వారు కూర్చుండి అధికారులతో దీటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ప్రజలు మండిపడ్డారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన గ్రామసభలు కొన్నిచోట్ల 10 గంటలు దాటినా ప్రారంభం కాలేదు.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించలేదని తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డిపై నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసహనం వ్యక్తంచేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను కాకుండా ప్రొటోకాల్ విస్మరించి కాంగ్రెస్ నాయకులతో నిర్వహించడం ఏమిటి అంటూ పలుచోట్ల అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. క్షేత్రస్థాయి అధికారులకు సరైన శిక్షణ, అవగాహన లేకపోవడంతో తొలిరోజు చాలా గ్రామసభల్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు నింపడంలో ప్రజల్లో గందరగోళం నెలకొన్నది.
కార్యక్రమం నిర్వహించామా.. దరఖాస్తులు స్వీకరించామా.. అయి పోయిందా..? అన్నట్లుగా కొనసాగింది. ప్రజ లు ఏం అడుగుతున్నారు..? వారికి ఉన్న సందేహాలను ఎలా నివృత్తి చేద్దాం అనే కోణంలో అధికార యంత్రాంగం పనిచేయడం లేదని చెప్పాలి. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరి కావడంతో కొంతమంది ఆధార్ కార్డులు ఆప్డేట్ లేకపోవడంతో ఆధార్ సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. ఇదే సమయంలో దరఖాస్తు ఫారాల కోసం జిరాక్స్ సెంటర్లకూ ప్రజలు పరుగులు పెట్టారు. కౌంటర్ల వద్ద ప్రజల సందేహాలు నివృత్తి చేయడానికి ఎవరూ కనిపించలేదు. దీంతో ప్రజలు దరఖాస్తు ఫారాల్లో ఏమి నింపాలి.. ఎలా నింపాలి.. అనే సందేహాలతో ఇబ్బందులు పడ్డారు.