మెదక్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా మరోసారి రాష్ట్ర స్థాయి అవార్డుల్లో ఆదర్శంగా నిలిచిందని, జిల్లాకు రెండు అవార్డులు వచ్చాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ఉత్తమ గ్రామ పంచాయతీలుగా మెదక్ జిల్లా రామయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం, నర్సాపూర్ నియోజకవర్గంలోని చిప్పల్తుర్తి గ్రామాలు రాష్ట్ర స్థాయిలో అవార్డులకు ఎంపికయ్యాయన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో విశేష కృషి చేసినందుకు చిప్పల్తుర్తి గ్రామం అవార్డుకు ఎంపికైందన్నారు. చిన్నపిల్లల సంరక్షణ, బర్త్ డే సెలెబ్రేషన్స్, ఆడపిల్లలకు పంచాయతీ నుంచి సుకన్యా సమృద్ధి యోజన పథకానికి ఆర్థిక చేయూత అందించడంలో ప్రగతి ధర్మారం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉత్తమ గ్రామ పంచాయితీలుగా నిలిచిన రెండు గ్రామాలను మంత్రి అభినందించారు. అవార్డులు సాధించిన చిప్పల్ తుర్తి, ప్రగతి ధర్మారం గ్రామాలు మరిన్ని గ్రామాలకు స్ఫూర్తిగా నిలువాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధికి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేలు, భాగస్వామ్యమైన గ్రామాల ప్రజలు, విశేష కృషిని అందించిన ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.
ప్రగతి ధర్మారం గ్రామానికి రాష్ట్రస్థాయి అవార్డు
సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, సెల్ఫ్ సఫీషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మండలంలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ఎంపికైందని సర్పంచ్ శంకర్, పంచాయతీ కార్యదర్శి మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా గ్రామాన్ని తీర్చిదిద్ది, మౌలిక వసతుల కల్పించామని, పంచాయతీ వార్డు సభ్యులు వార్డుల్లో తమ శక్తి మేర పనులు చేస్తున్నారని తెలిపారు. పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామంలో ఎవరికి వారు తమ పనులు చేసుకుంటున్నారన్నారు. అందుకోసమే రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైందని తెలిపారు. ఒకప్పుడు గ్రామంలో తాగునీరు కూడా సరిగ్గా ఉండేది కాదని, తెలంగాణ రాష్ట్రం రావడంతో కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారని, దీంతో అభివృద్ధిలో గ్రామం దూసుకుపోతున్నదని అన్నారు. గ్రామస్తులు చందాలు వేసుకుని వాటర్ ప్లాంటు, లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నారన్నారు. గ్రామానికి అవార్డు రావడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని మాజీ ఎంపీటీసీ సిద్దిరాంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
సుపరిపాలనలో చిప్పల్ తుర్తికి అవార్డు
తెలంగాణ ప్రభుత్వం వివిధ విభాగాల్లో గ్రామ పంచాయతీలకు అవార్డులను ప్రకటించింది. పంచాయతీ విత్ గుడ్ గవర్నెస్ విభాగంలో నర్సాపూర్ మండలంలోని చిప్పల్ తుర్తి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైనట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. పంచాయతీ కార్యాలయంలో వివిధ రకాల సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో మంచి ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఎంపీడీవో మార్టిన్ లూథర్ తెలిపారు. జిల్లా స్థాయిలో పెద్దచింతకుంట, నారాయణపూర్ పంచాయతీలు ఒక విభాగంలో, చిప్పల్తుర్తి పంచాయతీ రెండు విభాగాల్లో ఎంపికైందని పేర్కొన్నారు. చిప్పల్తుర్తి సర్పంచ్ శ్యామలా లక్ష్మణ్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తుల సహకారంతో సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు.