పటాన్చెరు, డిసెంబర్ 8: చార్మినార్ గోల్డ్ మునఖ్ఖా.. అబ్బో ఇదేదో కొత్త డిష్ అని లొట్టలేసుకుంటే మాత్రం కొంపలంటుకుపోతాయి. అవును మీరు విన్నది నిజమే. గంజాయి అమ్మే కేటుగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. గంజాయి అమ్మకాలు పెంచుకునేందుకు విద్యార్థులే లక్ష్యంగా వారు ఇష్టపడే చాక్లెట్ల రూపంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. పాశమైలారం, ఇస్నాపూర్లోని పలు పాన్షాప్ల్లో జరిపిన తనిఖీల్లో చాక్లెట్ల కథ వెలుగు చూసింది. ఈ మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం పటాన్చెరులోని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో సీఐ సీతారాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఒడిశా ప్రాంతానికి చెందిన వ్యక్తులు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మూడు పాన్షాప్లపై బుధవారం రాత్రి దాడులు చేశారు.
ఈ దాడుల్లో అనిమేశ్దాస్, రంజిత బాద్ర, బాజ్రమోహన్ పాత్రలకు సంబంధించిన పాన్డబ్బాల్లో సోదాలు నిర్వహించారు. ముగ్గురి పాన్డబ్బాల్లో 271 చాకెట్లు లభ్యమయ్యాయి. ఈ చాకెట్లను గంజాయితో తయారు చేసి, చార్మినార్ మునఖ్ఖా పేరుతో పారిశ్రామికవాడలో విక్రయిస్తున్నారు. ఒక్కో చాక్లెట్ను రూ.20కు అమ్ముతున్నారు. పాన్లు, సిగరెట్లతో పాటు ఈ చాక్లెట్లు బహిరంగంగానే అమ్మకానికి పెట్టారు. విద్యార్థులే టార్గెట్గా చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో ఎస్సైలు రాములు, శ్రీనివాస్, టైటస్ కుమార్, అఫ్జల్, సత్యనారాయణ, నగేశ్, యాదయ్య చారి, గంగాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.