మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట శివారుల జరిగిన వ్యాపారి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే వ్యాపారి ధర్మాకర్ శ్రీనివాస్ హత్యకు కారణమని నిర్ధారించారు. శ్రీనివాస్ హత్య జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు శ్రీనివాస్ను కత్తితో పొడిచి చంపినట్లు గుర్తించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి నిప్పంటించారని, సాక్ష్యాలను మాయం చేసేందుకే దహనం చేసినట్లు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మకారి శ్రీనివాస్ మరొకరు కలిసి రూ. కోటిన్నర లోన్ తీసుకున్నారు. ఆ డబ్బు లోన్ కట్టే వ్యవహారంలో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో గత కొన్ని రోజులుగా శ్రీనివాస్ లోన్ చెల్లించకపోవడంతో శ్రీనివాస్పై పార్ట్నర్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సుపారి ప్లాన్తో హత్య చేయించాడు. మంగళవారం సాయంత్రం దుండగులు రామాయంపేట రూట్లో శ్రీనివాస్ను అతి కిరాతకంగా హత్య చేశారు. మృతదేశహంతో ఆరుగంటల పాటు కారులోనే తిరిగినట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. నిందితులను సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. తుప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు విచారణ చేపట్టాయి. సాంకేతిక ఆధారాల సాయంతో ఈ కేసును ఛేదించారు.