హుస్నాబాద్, మార్చి 10: హుస్నాబాద్లో రన్నర్స్ అసోసియేషన్, పోలీసుశాఖ ఆధ్వర్యంలో హాఫ్ మారథాన్ (21కి.మీ.ల పరుగు పందెం, నాలుగో ఎడిషన్) ఆదివారం అట్ట్టహాసంగా నిర్వహించారు. హాఫ్ మారథాన్తో పాటు 10కే రన్, 5కే రన్ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మొదట ప్రారంభమైన హాఫ్ మారథాన్ పట్టణంలోని ఏనె నుంచి అక్కన్నపేట గ్రామపంచాయతీ వరకు వెళ్లి తిరిగి రావడంతో పూర్తయింది. 10కే రన్ ఏనె నుంచి చౌటపల్లి క్రాస్రోడ్డు వరకు వెళ్లి తిరిగి రావడం, 5కే రన్ పట్టణంలోని నాగారం రోడు, దవాఖాన రోడ్డు, డిపో రోడ్డు, మెయిన్రోడ్డు మీదుగా తిరిగి ఏనె వరకు చేరుకోవడంతో పందెం పూర్తయింది. హైదరాబాద్కు చెంది అంధుడు లక్ష్మీనారాయణతో పాటు 75 ఏండ్ల వృద్ధుడు నాగభూషణం హాఫ్ మారథాన్ పూర్తి చేయడం విశేషం. వీరిని మంత్రితో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హుస్నాబాద్ పట్టణం నుంచే కాకుండా హైదరాబాద్, సిద్దిపేట, మెదక్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో రన్నర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నిత్యం రన్నింగ్, వ్యాయామం, యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. కేవలం మెట్రోపాలిటన్ సిటీల్లో నిర్వహించే హాఫ్ మారథాన్ను హుస్నాబాద్లో నాలుగుసార్లు విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ సతీశ్ వాసాల, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్చైర్పర్సన్ అయిలేని అనితారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రఘుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆకుల వెంకట్, పీఈటీలు వెంకటనర్సయ్య, చింతకింది శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రన్నర్స్, క్రీడాకారులు పాల్గొన్నారు.
హుస్నాబాద్లో నిర్వహించిన హాఫ్ మారథాన్ పురుషుల విభాగంలో రమావత్ రమేశ్(నాగర్కర్నూల్) ప్రథమ స్థానంలో నిలవగా వాల్తా సంగూభాయ్ (వరంగల్) ద్వితీయ, తాతిరెడ్డి నిఖిల్రెడ్డి (గజ్వేల్) తృతీయ స్థానాన్ని సాధించారు. మహిళల విభాగంలో వడ్డె నవ్య(నల్గొండ) ప్రథమ, మద్దూరి కావ్య(వరంగల్) ద్వితీయ, సామ్యూల్గుల్(ఢిల్లీ) తృతీయ స్థానం పొందారు. 10కేరన్ పురుషుల విభాగంలో గోకర్ల అభిషేక్ ప్రథమ, పాయం శ్రావణ్ ద్వితీయ, డి.భరత్రాజ్ తృతీయ, మహిళల విభాగంలో కుషీకుమారి ప్రథమ, కల్యాణి ద్వితీయ, బడావత్ హారిక తృతీయ స్థానం పొందారు. 5కేరన్ పురుషుల విభాగంలో బోయ సింహ (కర్నూలు, ఏపీ) ప్రథమ, అనుతిరుపతి (జగిత్యాల) ద్వితీయ, ఆదికేశవ(హన్మకొండ) తృతీయ స్థానంలో నిలిచారు. మహిళల విభాగంలో ఎస్కే ఆఫ్రీన్ ప్రథమ, అంజుమ్ ద్వితీయ, బానావత్ ఇందు తృతీయ స్థానం సాధించారు. వీరందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ నగదు బహుమతులు అందజేశారు. పాల్గొన్న రన్నర్స్ అందరికీ మెడల్స్ పంపిణీ చేశారు.