చేర్యాల, జూలై 20: చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కంట్రోల్ కమిటీ చైర్మన్ అందె బీరన్న అన్నారు. చేర్యాలలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జనగామ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెవెన్యూ డివిజన్ చేస్తామని రేవంత్రెడ్డి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు.
నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్రెడ్డి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఒక్క సభలో మాట్లాడలేదని, ఎన్నికల ముందు గ్రామగ్రామాన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన సదరు నేత నోరు విప్పడం లేదన్నారు. భువనగిరి ఎంపీగా గెలిచిన చామల కిరణ్కుమార్రెడ్డి సైతం తాను విజయం సాధించిన వెంటనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు.చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ఈనెల 25న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే చేర్యాల బంద్కు అన్నివర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మండల అధ్యక్షుడు పుల్ల ఆంజనేయులు, నాయకులు యాదయ్య, రాజు, తిరుపతి, నవీన్, వెంకటేశం, ఐలయ్య పాల్గొన్నారు.