దుబ్బాక, ఏప్రిల్ 28: మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అని, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండలం నగరంలోని రామలింగేశ్వర ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ యూత్, పీవీఆర్ ట్రస్టు సభ్యుల(వలంటీర్స్)తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన బీఆర్ఎస్ యూత్, పీవీఆర్ ట్రస్టు సభ్యులు సోషల్ మీడియాతో పాటు గ్రామాల్లో ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ సాధించిన భారీ మెజార్టీని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి తిరిగి అందించాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రచారంతో పాటు కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలన్నారు. గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేస్తూ కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. నిస్వార్థంతో ప్రజాసేవకు అంకితమైన వెంకట్రామిరెడ్డి గురించి గ్రామాల్లో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కోరారు.
కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతోమంది పేదలకు సహాయ సహకారాలు అందించారన్నారు. పేదల సంక్షేమానికి వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పీవీఆర్ ట్రస్టు ద్వారా చేపట్టనున్న సేవలను ప్రజలకు వివరించేందుకు పీవీఆర్ వారియర్స్, బీఆర్ఎస్ యూత్ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పీవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేపట్టి నిరుపేదలకు రూపాయికి ఫంక్షన్హాల్ వినియోగం, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యకు కావాల్సిన ఆర్థిక సహాయం, పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ అవకాశం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మనోహర్రావు, రొట్టే రాజమౌళి, సోలిపేట సతీశ్రెడ్డి, వెంకటనర్సింహ్మారెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, నాయకులు కొత్త కిషన్రెడ్డి, బనాల శ్రీనివాస్, జీడిపల్లి రవి, పంజాల శ్రీనివాస్, జీడిపల్లి రాంరెడ్డి, మల్లారెడ్డి , కృష్ణ. యూత్ నాయకులు శేఖర్గౌడ్, మహేశ్రెడ్డి, పీవీఆర్ వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.
మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించి మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని, ఐదేండ్ల పాటు మీ సేవకు అంకితమవుతానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, రూ. 100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు, పేద విద్యార్థులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాదిరిగా తాను మోసపూరిత హామీలు ఇవ్వడం లేదని, చేసేదే చెబుతానని, చెప్పిందే చేస్తానని తెలిపారు.