సంగారెడ్డి, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్పై ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. బడ్జెట్లో రైల్వే, మౌలిక వసతుల కల్పన, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ప్రజలు ఆశగా ఎదురుచూశారు. అయితే, ఉమ్మడి జిల్లాకు మేలు జరిగేలా ఎలాంటి ప్రకటనలు, నిధులు ప్రకటించకపోవడంతో నిరాశకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లావాసులు ఎంతోకాలంగా పటాన్చెరు వద్ద వట్టినాగులపల్లి-సంగారెడ్డి-జోగిపేట మీదుగా అదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్ను ప్రతిపాదించగా, రైల్వేశాఖ సర్వే పనుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు బీజేపీ ప్రభుత్వం తీరుపై అంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట-సికింద్రాబాద్ రైల్వేలైన్ విద్యుద్దీకరణ, సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వేలైన్ డబ్లింగ్, మెదక్-చేగుంట రైల్వేగేటు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. మియాపూర్-పటాన్చెరు మెట్రోరైల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. సంగారెడ్డి జిల్లాలోని నిమ్జ్లో పరిశ్రమల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన కోసం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. కేంద్రం ఆదాయ పన్ను పరిమితి పెంచుతుందని ఉద్యోగులు ఆశించారు. అయితే, గత బడ్జెట్లో ప్రకటించిన విధంగానే రూ.7 లక్షల వరకు పన్ను మినహాయింపునిచ్చింది. దీంతో ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ హైదరాబాద్ కృత్రిమ మేధ, సెమీకండక్టర్ల రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. అయినప్పటికీ ఐఐటీకి నిధులు కేటాయించలేదు. బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్కు చెక్పెట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 9 నుంచి 18 ఏండ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్(గర్భాశయ ముఖద్వారా క్యాన్స ర్) బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అంగన్వాడీలు, ఆశవర్కర్లకు వైద్య సేవలు అందించనున్నారు. అంగన్వాడీల ద్వారా పిల్లలు, గర్భిణులకు మరింత మెరుగైన పౌష్టికాహారం అందజేసేందుకు నిధులు ప్రకటించింది. రైతులకు తక్కువ ధరకు రసాయనిక ఎరువులు అందేలా చర్యలు తీసుకోనున్నది. మధ్యతరగతి వారి కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ను తీసుకురానుండడంతో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల త్వరలో నెరవేరే అవకాశమున్నది. ఉపాధి హామీ పథకానికి రూ.86వేల కోట్లు కేటాయించింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈజీఎస్ ద్వారా మరిన్ని పనులు చేపట్టే అవకాశం ఉన్నది.
కేంద్ర బడ్జెట్ వేతన జీవులను పూర్తిగా నిరాశపర్ఛింది. కొత్త పన్నుల విధానంలో 80ఈ, 80డీ, ఇంటి అద్దె, విద్య, గృహ రుణాలపై వడ్డీ తదితర మినహాయింపులు వర్తింపజేయాలని మూడేండ్లుగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు కోరుతున్నా పట్టించుకోలేదు. బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణలు చేసి పన్నులభారం తగ్గించి ఉపశమనం కలిగించాలి. ప్రత్యక్ష పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలి.
కేంద్ర బడ్జెట్ ఉద్యోగులను తీవ్ర నిరాశ పర్చింది. ప్రత్యక్ష పన్నులతో పాటు ఇంపోర్టు డ్యూటీల విధానంలోనూ ఎలాంటి మార్పులు చేయలేకపోవడం ఉద్యోగ వర్గాలకు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు లాభం లేదు. బడ్జెట్లో రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను లేదని ప్రకటించడం కొంతమేరకు ఆదాయపన్ను వర్గాలకు ఊరట అని చెప్పవచ్చు. విద్యకు మరిన్ని కేటాయింపులు చేస్తే బాగుండేది.