అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దూసుకెళ్తున్నది. అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారు. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రకటించిన వరాలైన దివ్యాంగులకు పెన్షన్ పెంపు, ఇండ్ల పట్టాలు, రెండో విడత గొర్రెల పంపిణీ, బీసీ కులవృత్తులకు ఆర్థిక సాయంపై మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో హర్షాతిరేకాలువ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మిఠాయిలు పంచి ఆయా వర్గాలు సంబురాలు చేసుకున్నాయి. తమ సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు అన్ని వేళలా అండగా ఉంటామని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
– సంగారెడ్డి/మెదక్ (నమస్తేతెలంగాణ), జూన్ 10
సీఎం కేసీఆర్తోనే కుమ్మరుల అభివృద్ధి
కుమ్మరులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యం. ఇటీవల సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు రూ. లక్ష అందించి ఆదుకుంటానని హామీ ఇవ్వడంతో ఎంతో భరోసా కలిగింది. రానురానూ కుమ్మరివృత్తి కనుమరుగు కాకుండా ఉండాలంటే మట్టిపాత్రలపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించేలా కృషి చేయాలి. అందరికీ ఆర్థికంగా సహకరిస్తే నిలదొక్కుకుంటాం.
– కుమ్మరి పెద్ద మల్లేశం, గోమారం, శివ్వంపేట
సంగారెడ్డి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులు, బీసీలు, పేదలకు వరాలను ప్రకటించారు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా వెనుకబడిన తరగుతుల్లో కులవృత్తులు చేసుకునేవారికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేస్తున్నారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని రూ.3,116 నుంచి రూ.4,116కు పెంచారు. ప్రతినెలా రూ.1000 పింఛన్ మొత్తాన్ని పెంచారు. దీంతో దివ్యాంగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ రెండో విడుత గొర్రెల పంపిణీని ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో రెండోవిడుతలో 10,331 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఇండ్లులేని పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయటం ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లాలో అర్హులైన వారిని అధికారులు గుర్తించి ఇండ్ల స్థలాలు అందజేస్తున్నారు.
బీసీ కులవృత్తుల వారికి లక్ష ఆర్థికసాయం
సీఎం కేసీఆర్ బీసీల వెన్నంటి ఉంటున్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా బీసీల్లోని 15 రకాల కులవృత్తులు చేసేవారికి రూ.లక్షను ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో ఈ పథకం ప్రారంభమైంది. గత రెండురోజుల్లో 16మందికి రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందజేశారు. జిల్లాలో ఈ పథకం ద్వారా నాయీబ్రాహ్మణులు, రజకులు, వడ్డెరులు, విశ్వబ్రాహ్మణులు, బెస్తలు, ముదిరాజ్లు ఇలా 15 రకాల కులవృత్తులు చేస్తున్న వారికి రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తున్నారు. జిల్లాలో ఈ పథకం కింద ఇప్పటివరకు 71 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థికసాయం కోసం ఈనెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభం
సంగారెడ్డి జిల్లాలో రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గొర్రెల పంపిణీని ప్రారంభించారు. మొదటి రోజు 200 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో రూ.187 కోట్లతో 19,203యూనిట్ల గొర్రెలు పంపిణీ చేసింది. తాజాగా రెండోవిడుతలో 10,331 యూనిట్లను పంపిణీ చేయనుంది. ఒక్కో యూనిట్లో గొల్లకుర్మలకు రూ.1,31,250 సబ్సిడీగా లభిస్తుంది. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొటేలు ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 4280 మంది తమ వాటాను చెల్లించారు. మిగితా గొర్రెలకాపర్లు యూనిట్ల కోసం తమ వాటా మొత్తాన్ని చెల్లిస్తున్నారు.
జిల్లాలో 15,139 మంది దివ్యాంగులకు లబ్ధి
దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అత్యధికంగా ప్రతినెలా పింఛన్ అందజేస్తున్నారు. ఇప్పటివరకు దివ్యాంగులకు ప్రభుత్వం రూ.3,116 పింఛన్ అందజేస్తుంది. అయితే తాజాగా సీఎం కేసీఆర్ దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచారు. దీంతో దివ్యాంగులకు ఇకపై ప్రతినెలా రూ.4,116 పింఛన్ రానుంది. ప్రభుత్వ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలో పింఛన్ అందుకుంటున్న 15,139 మంది దివ్యాంగులు లబ్ధిపొందన్నారు. జిల్లాలో మొత్తం 15,139 మంది దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ అందజేస్తుంది. అందోలు నియోజకవర్గంలో 2513, నారాయణఖేడ్లో 3026, పటాన్చెరులో 2683, సంగారెడ్డిలో 2838, జహీరాబాద్లో 3522, హత్నూర మండలంలో 557 మంది దివ్యాంగులు ఇకపై ప్రతినెలా రూ.4,116 పింఛన్ అందుకోనున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం కొత్తగా దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు పింఛన్ మంజూరు చేయనుంది.
దివ్యాంగులకు దైవం సీఎం కేసీఆర్
అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్న మాలాంటి దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఇస్తున్న రూ.3,116కి మరో వెయ్యి పెంచడంతో రూ.4,116 ఇస్తానని ప్రకటించడంతో దివ్యాంగులు సంతోషపడుతున్నారు. సీఎం కేసీఆర్ సారూ వెన్నంటి ఉంటూ ఆయన అడుగులో అడుగు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. దీనికి దివ్యాంగులందరూ సమర్ధిస్తున్నారు.
– సుంకరి శంకర్ముదిరాజ్, దివ్యాంగుడు, బొంతపల్లి, గుమ్మడిదల మండలం
దివ్యాంగులను ఆదుకుంటుండు..
దివ్యాంగులకు సీఎం సార్ పింఛన్ మరొక్క వెయ్యి పెంచిండు. మాకు అండగా ఉన్న సీఎం సార్ను జీవితకాలం మరచిపోం. మునుపు రూ.3,116 పింఛన్ వస్తుండే, ఇప్పుడు వెయ్యి పెంచడంతో రూ.4,116 వస్తది. ఇప్పుడు మాకు ఏం ఇబ్బంది ఉండదు.
– బైరం శ్రీనువాస్, రామాయంపేట
జీవితాంతం రుణపడి ఉంటాం..
అంగవైకల్యంతో బాధపడుతున్న మాకు సీఎం కేసీఆర్ సార్ ఆదుకుంటున్నాడు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.3,116 పింఛన్ను సకాలంలో బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. మరో వెయ్యి పెంచుతూ వచ్చే నెల నుంచి పింఛన్ రూ.4,116 అందజేస్తామని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించడంతో మా లాంటి ఎంతోమంది దివ్యాంగులకు ఆనందానికి అవధులేవు. కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– కొమ్మాట రామస్వామి, దివ్యాంగుల సంఘం మండలాధ్యక్షుడు, నిజాంపేట
బీసీలకు మేలు జరుగుతుంది..
బీసీలకు రూ.లక్ష ఇవ్వడంతో వెనకబడిన వారు ఆర్థికంగా ఎదగడానికి, చిరు వ్యాపారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే గతంలో దరఖాస్తులు చేసుకున్న బీసీ కార్పొరేషన్ రుణాలు అందిస్తే బీసీల్లో అన్నివర్గాలు మరితంగా ఆర్థికంగా ఎదుగుతారు. బీసీల అభివృద్ధికి ప్రవేశపెట్టే పథకాలకు మా వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
– మెట్టు గంగారాం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, రామాయంపేట రూరల్
బీసీ కార్పొరేషన్కు దరఖాస్తు చేసుకున్న..
చేపలు పట్టుకుని అమ్ముకునేటోళ్లకు ఉచితంగానే చేపపిల్లలను ఇచ్చిన సీఎం కేసీఆర్ సార్ రుణం తీర్చుకోలేనిది. మత్స్యకారులకు సభ్యత్వం ఉన్నోల్లందరికీ బీమా కూడా ఉన్నది. చేపలు అమ్మకోవడానికి వాహనాలు కూడా ఇచ్చిండు. మేమెప్పుడూ సీఎం కేసీఆర్ సార్ మనుషులమే. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ కింద రూ.లక్ష రుణాలు ఇస్తడంట. కుంటలో చేపలు పెంచుకుని, అమ్ముకునేందుకు ఆ రుణానికి దరఖాస్తు చేసుకున్న.
– తౌడబోయిన దుర్గయ్య, నందిగామ, రామాయంపేట