మెదక్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రానున్న లోక్సభ ఎన్నికల-24ను దృష్టిలో ఉంచుకుని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా ఎస్పీ బి.బాలస్వామి, సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల గురించి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. (మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, పటాన్చెరు) నియోజకవర్గాల్లో వనరబుల్ మ్యాపింగ్ తయారు చేయాలని, ఫామ్6, ఫామ్8 దరఖాస్తులు పెండింగ్లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని, ఫామ్ ప్రాసెస్ ఏదీ పెండింగ్లో ఉండొద్దన్నారు. స్వీప్ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఎన్నికల సిబ్బందిని నియమించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
SST, AT, VST, FST, FS, MCC లాంటి అన్ని టీమ్లను పకడ్బందీగా నియమించాలని, నూతన టీమ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏడు నియోజకవర్గాలకు నోడల్ అధికారుల నియామకం పూర్తి చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ సెంటర్లను అధికారులు పరిశీలించాలన్నారు. ఓటరు నమోదు పూర్తిచేయాలని, నమోదులో ఫొటో మార్పు, డబుల్ ఎంట్రీ, చిరునామా మార్పు, మరణించిన వారి వివరాలు సరిచూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బీఎల్వోలకు శిక్షణ ఇవ్వాలన్నారు. 1, 2వ ర్యాండమైజేషన్ పూర్తి చేయాలని, పోస్టల్ బ్యాలెట్, ఫామ్ 12 పూర్తి చేయాలని, ఓటరు జాబితాను చివరి పబ్లికేషన్కు పూర్తి చేసి అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, అదనపు ఎస్పీలు పాల్గొన్నారు.