జహీరాబాద్, జూన్ 17 : రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త డాక్టర్ కవిత సూచించారు. ఈ నెల 15వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ’ప్రభుత్వ వైద్యం.. అందని దైనం..అనే కథనానికి సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరి యా దవాఖానను జిల్లా దవాఖానల సేవల సమన్వయ కర్త డాక్టర్ కవిత సందర్శించారు. స్థానిక దవాఖాన సూపరిండెంటెంట్ కిరణ్కుమార్, వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు కాన్పులు చేయించుకునేందుకు దవాఖానకు వస్తే సంబంధిత వైద్యాధికారులు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరుకావడం ఏమిటని ప్రశ్నించారు. కాన్పులు చేయకుండా ఇతర దవాఖానలకు వెళ్లాలని సూచించడం సరికాదన్నారు. రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆనంతరం దవాఖానలో పలురికార్డులు పరిశీలించడంతో పాటు వార్డుల్లో పర్యటించి వైద్య సేవల గురించి రోగులను ఆమె అడిగి తెలుసుకున్నారు.
వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలి
జహీరాబాద్ ఏరియా దవాఖానలో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులను వెంటనే భర్తీచేసేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయ కర్త డాక్టర్ కవితను జహీరాబాద్ పట్టణ కౌన్సిలర్లు నామ స్రవంతి, మజ్జిగ సుజిత, నాయకులు నామరవికిరణ్, విశ్వేశ్వర్ కోరారు. ఈ సందర్భంగా ఆమెను కలిసి స్థానిక దవాఖానలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.