సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 8: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు స్థానిక అవసరాలకే ఖర్చుచేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలెక్టరేట్లో ఎమ్మెల్యే కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో విలేకరులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుగాంచిన పటాన్చెరు ప్రాంతంలో పరిశ్రమల కాలుష్యంతో నష్టపోతున్నట్లు తెలిపారు.
ఇక్కడి పరిశ్రమల సీఎస్ఆర్ నిధులు స్థానిక అభివృద్ధి పనులకే కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు వస్తాయని 70వ దశకంలో పటాన్చెరు ప్రాంత ప్రజలు మూడు పంటలు పండే భూములు ఇచ్చినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశం మైలారం, పటాన్చెరు, జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం, కాజీపల్లి, కిష్టాయిపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, గుమ్మడిదల అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, గండిగూడేం, దయరా గ్రామాల పరిధిలో అనేక రకాల పరిశ్రమలు ఏర్పాటు అయినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బల్క్ డ్రగ్స్, రసాయనిక పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని, అంతేస్థాయిలో కాలుష్యం పెరిగిందన్నారు.

కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టు సైతం
పటాన్చెరు నియోజకవర్గ కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టు సైతం జస్టిస్ మెహతా కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నివేదికను తెప్పించుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గుర్తుచేశారు. నాటి ఉమ్మడి ఏపీ గవర్నర్ రంగరాజన్ పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించి కాలుష్య పరిస్థితులను తెలుసుకున్నారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2016లో చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ కాలుష్య నివారణ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.
కాలుష్యంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నందున, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుతో పాటు ఇస్నాపూర్, పెద్ద చెరువు, గండిగూడెం, ఆసాని కుంట, కిష్టారెడ్డిపేట చెరువుల పరిధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ సైతం ఏర్పాటు చేయాలని ఆదేశాల జారీచేసిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తుచేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పటాన్చెరు సీఎస్ఆర్ నిధులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఇస్తూ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆరోపించారు. రెండున్నరేండ్లుగా సీఎస్ఆర్ నిధులు లేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సీఎస్ఆర్ నిధులు స్థానికంగా ఖర్చు చేయాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.