దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్రెడ్డితో కలిసి 250 మంది దివ్యాంగులకు మంత్రి స్కూటీలు అందజేశారు. రూ. 10 కోట్లతో చేపట్టనున్న పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. 200 మంది ఐకేపీ మహిళా సిబ్బందికి యూనిఫాం, ఐడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు రూ. 3వేలు పింఛన్ ఇస్తున్నదన్నారు. పటాన్చెరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఏర్పాటు చేసేలా సీఎం కేసీఆర్తో చర్చిస్తానని, రూ. 250కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు సీఎంతో శంకుస్థాపన చేయిస్తామని హామీ ఇచ్చారు.
– పటాన్చెరు, మార్చి 28
పటాన్చెరు, మార్చి 28 : ‘బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ ఆస్తులను పెంచుతున్నది… అదానీ ఆస్తులను బీజేపీ సర్కార్ పెంచుతున్నది. అది బీఆర్ఎస్కు బీజేపీకి ఉన్న తేడా’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్రావు 250 మంది దివ్యాంగులకు యాక్టివా స్కూటీలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు దివ్యాంగులతో మాట్లాడారు. ఇచ్చిన వాహనాన్ని ఎలా ఉపయోగించుకుంటారని ప్రశ్నించగా, చిరు వ్యాపారాలు చేసుకుంటామని కొందరు, గ్రూప్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్లకు వెళ్తామని మరి కొందరు అన్నారు. పటాన్చెరు పోలీస్స్టేషన్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వరకు రూ. 10కోట్లతో తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 200 ఐకేపీ మహిళా సిబ్బందికి రెండు జతల యూనిఫాం, ఐడీ కార్డులు మంత్రి అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నెలకు రూ. 3వేల పింఛన్ అందిస్తున్నదని, పీఎం మోదీ సొంత రాష్ట్రంలో రూ. 500, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రూ. 600లకు మించి ఇవ్వడం లేదన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చేస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. సేవా భావంతో చేస్తున్న ఈ కార్యక్రమం మరికొందరికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్లు ప్రజలను అయోమయంలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అదానీకి రాయితీలను ఇస్తూ నిరుపేద రైతులకు అన్యాయం చేస్తున్నదన్నారు.
కేంద్రం ఒత్తిడితో ఎస్బీఐ రూ. 12వేల కోట్లు అదానికి మాఫీ చేసిందని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని తమ సన్నిహితులకు దోచిపెట్టడం సబబు కాదని చెప్పారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వినతి మేరకు సీఎం కేసీఆర్తో చర్చించి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును పటాన్చెరులో ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రూ. 250కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానకు సీఎం కేసీఆర్తో శంకుస్థాపన చేయిస్తామని అన్నారు. ఒకప్పుడు కాలుష్య కాసారంగా ఉన్న పటాన్చెరులో ఇప్పుడు కాలుష్య రహిత పరిశ్రమలు వచ్చాయన్నారు. నిరంతర విద్యుత్తో పరిశ్రమలు మూడు షిప్టులు నడిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రగతి ప్రస్థానంలో పటాన్చెరు శరవేగంగా దూసుకుని పోతున్నదని కొనియాడారు.
సంక్షేమానికి కట్టుబడి ఉంటాం : ఎమ్మెల్యే
దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. తన పుట్టిన రోజున 36మందికి స్కూటీలు అందజేయగా, నియోజకవర్గంలో మరో 350 మంది దివ్యాంగులు తమకు వాహనాలు కావాలని అడిగారన్నారు. ఇప్పుడు 250 ఇస్తున్నామని, త్వరలో మిగిలిన వారికి ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్తో సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేయించాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. పటాన్చెరు నియోజకవర్గంపై ప్రేమతో సీఎం సుల్తాన్ఫూర్ మెడికల్ డివైజ్ పార్క్ను మంజూరు చేశారని, అక్కడ 15వేలమందికి ఉపాధి లభిస్తున్నదన్నారు. శివానగర్ ఎల్ఈడీ పార్క్ను అందించారని అది త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కార్యక్రమంలో శాసనమండలి మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీఎస్పీ భీంరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, ఈర్లదేవానంద్, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్రెడ్డి, కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, సింధూ ఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ రోజా బాల్రెడ్డి, అమీన్పూర్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, అమీన్పూర్ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, అఫ్జల్, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, సర్పంచ్లు ఉపేందర్, మాణిక్రెడ్డి, సుధీర్రెడ్డి, జగన్, మెరాజ్ఖాన్, వడ్డె కుమార్, మండల పార్టీ అధ్యక్షులు పాండు, గడ్డ యాదయ్య, ప్రభాకర్గుప్త, కృష్ణయాదవ్, చంద్రశేఖర్ముదిరాజ్, రామకృష్ణముదిరాజ్, నాగజ్యోతి లక్ష్మన్, మన్నెరాజు,వెంకట్రెడ్డి, నీనా చంద్రశేఖర్రెడ్డి, రమేశ్బాబు, వంగరి అశోక్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంచారు..
దివ్యాంగులకు స్కూటీలు అందజేసి వారిలో ఆత్మవిశ్వాసం పెంచారని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి అన్నారు. 250మంది దివ్యాంగులకు స్కూటీలు ఉచితంగా ఇవ్వడం రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చేస్తున్న సాయం చరిత్రలో నిలుస్తుందన్నారు. దివ్యాంగుల తరపున ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 12కోట్లు విడుదల చేసిన మంత్రి హరీశ్రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.