సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 3 నుంచి నేటి వరకు
7,750 మంది విద్యార్థుల నమోదు
మెదక్ జిల్లాలో కొత్తగా 6,249 మంది చేరిక
నూతన విద్యాసంవత్సరంలో ఉత్సాహంగా బడిబాట పట్టిన విద్యార్థులు
పాఠశాలలు తెరుచుకుని పది రోజులు పూర్తి
సంగారెడ్డి జిల్లాలో 1800 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు
సర్కారు బడుల్లో చదువుకుంటున్న లక్షా 58 వేల మంది
జిల్లాకు చేరుకున్న 48 శాతం పాఠ్యపుస్తకాలు
త్వరలో పంపిణీకి ఏర్పాట్లు
మెదక్ జిల్లాలో 1,062 ప్రభుత్వ పాఠశాలలు
బడిబాటతో పెరుగుతున్న ప్రవేశాలు
‘మనఊరు – మనబడి’తో మరిన్ని సౌకర్యాలు
గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే శిథిలావస్థలో భవనాలు, కూలిపోతున్న పైకప్పులు దర్శనమిచ్చేవి. వాటన్నింటికీ చెక్ పెడు తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి.. మౌలిక వసతులు కల్పిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నది. దీంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల బోధన ప్రవేశపెట్టడంతో విద్యార్థులందరూ సర్కారు బడులకు వస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. నాణ్యమైన ఉచిత విద్య, పుస్తకాలు, డ్రెస్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతులు, కమ్మని మధ్యాహ్న భోజనం, కిచెన్ షెడ్లు, తదితర అన్ని మౌలిక వసతులతో పాటు ఇంగ్లిష్ మీడియం తరగతులను సైతం ప్రారంభిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై పదిరోజులు కాగా, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు కొత్తగా 7,750 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 48శాతం పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకోగా, మిగతావి త్వరలో రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ముద్రిస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీలోగా యూనిఫాంలు కూడా జిల్లాకు చేరనున్నాయి. ‘మనఊరు- మనబడి’ కింద తొలివిడతలో 441 పాఠశాలలను ఎంపిక చేసి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మెదక్ జిల్లాలో 6,249 మంది పాఠశాలల్లో కొత్తగా చేరగా, ‘మనఊరు – మబడి’ కింద 113 బడులను ఎంపిక చేసి 118 చోట్ల పనులు చేపడుతున్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్పొరేట్కు దీటుగా అన్ని వసతులు కల్పిస్తుండడంతో ఈ ఏడాది సర్కారు పాఠశాలల్లో అడ్మిషన్లు భారీగా పెరిగాయని విద్యాశాఖ చెబుతున్నది.
సంగారెడ్డి కలెక్టరేట్ /మెదక్ మున్సిపాలిటీ, జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమంతో చేపట్టిన కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుండటంతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం, మౌలిక సదుపాయాలము కల్పించడంతో పాటు డిజిటల్ బోధన అందించేందుకు అధికారులు ప్రణాళికలు చేపట్టారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే శిథిలావస్థలో భవనాలు, కూలిపోతున్న పైకప్పులు దర్శనమిచ్చేవి. వాటన్నింటికీ చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది. పాఠశాలల్లో కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, కొత్త తరగతి గదులు, ప్రహారి నిర్మాణాలు, డిజిటల్ తరగతుల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టలేక, శిక్షణ పొందని ఉపాధ్యాయుల బోధనపై అసంతృప్తితో విద్యార్థులు ప్రైవేటు బడుల నుంచి సర్కారు బడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
కొత్తగా చేరిన 6249 విద్యార్థులు
మనఊరు-మనబడి కార్యక్రమంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 6249 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులు సమకూర్చడం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన విద్య అందిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.
జిల్లాలో 1,062 పాఠశాలలు
మెదక్ జిల్లాలో 1,062ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 637ప్రాథమికోన్నత పాఠశాలలు 183, ఉన్నత పాఠశాలలు 242ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో 1నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం తరగతులు ప్రారంభించనున్నారు. ఆ తరువాత పదో తరగతి వరకు విస్తరింపచేయనున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో జిల్లాలో మొ దటి విడతలో 313పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 118పాఠశాలల్లో పనులు చేప ట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. దీంతో సర్కార్ బడుల్లో కొత్తగా చేరే విద్యార్థుల సంఖ్య క్రమం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, స్కూ ల్ డ్రెస్సులు ఉచితంగా అందజేస్తున్నది. అంతేకాకుండా పరీక్షల సమయంలో సాయం కాలం పోషక విలువలతో కూడిన స్నాక్స్ ఇస్తూ, ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ప్రైవేటుకు దీటుగా సర్కారు బడులు
సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 24: వేసవి సెలవుల్లో ఆడుతూ పాడుతూ కాలం గడిపిన విద్యార్థులు బడిబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడా ది మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో బడిబాట కూడా విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో మొత్తం 1800ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా, ఇందులో 1356 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 444 ప్రైవేటు పాఠశాలలు, 5ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం లక్షా 1,58,000 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నందున ఈ సంఖ్య మరింత పెరగనున్నది.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా…
పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులందరూ ఉత్సాహంగా పాఠశాలలకు వెళ్తున్నారు. చదువులతో పాటు ఆట పాటలతో గడిపేస్తున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. విద్యాశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. అందుకు నిదర్శనం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడమే.
మనఊరు-మనబడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి (ఫైల్)
తరగతి గదిలో చదువుకుంటున్న విద్యార్థులు
మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థులు
విజయవంతంగా బడిబాట
జిల్లాలో నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఉపాధ్యాయుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి వరకు బడిబాట కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 3న ప్రారంభమైన బడిబాటలో భాగంగా జిల్లాలో ఈ నెల 23నాటికి 8,890 మంది విద్యార్థుల నమోదుతో రాష్ట్రస్థాయిలో జిల్లా రెండో స్థానంలో ఉంది. బడిబాటలో తొలిరోజు 344మంది విద్యార్థుల ఎన్రోల్మెంట్ చేసుకోగా రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ముందు స్థానంలో నిలిచింది. అదే ఉత్సాహంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో కలిసి ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల నమోదుకు కృషి చేస్తున్నారు. తాజా గా, సోమవారం సంగారెడ్డిలోని రాజంపేట, విజయనగర్ కాలనీలను సందర్శించిన పీఆర్పల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు జాకీర్ హుస్సేన్ వీధిలో చీపురు పట్టి ఊడ్చుతున్న ఓ చిన్నారిని గమనించాడు. దీంతో సంబంధిత చిన్నారి తల్లిదండ్రులను పిలిచి ఆరాతీయ గా వలస కూలీలుగా తేల్చారు. అయినా సరే పిల్లలు బడిలోనే ఉండాలని, వీధిలో కాదని హితవు చేస్తూ ఆ అమ్మాయిని ప్రభు త్వ బడిలో చేర్పించాలని సూచించారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి సదరు అమ్మాయిని పాఠశాలలో చేర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
త్వరలో పాఠ్య పుస్తకాల పంపిణీ
ఇదిలా ఉండగా జిల్లాలో పాఠ్య పుస్తకాలు 8,58,616 అవస రం ఉండగా 4,03,250 చేరుకున్నాయి. మిగతావి త్వరలోని వస్తాయని అధికారులు తెలిపారు. పంపిణీ త్వరలో చేపట్టేందుకు విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే 48శాతం పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకోగా మిగతా 22శాతం పాఠ్య పుస్తకాలు రాగానే విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. పిల్లలకు యూనిపంలు జూలై 4వ తేదీలోగా వస్తాయన్నారు. ఈ ఏడాది నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు పూర్తిగా తెలుగు మాద్యమంలో చదువుకుంటున్న విద్యార్థులకు ఒక్కసారిగా ఆంగ్ల మాద్యమం ప్రవేశపెడితే ఇబ్బందులు వస్తాయనే భావనతో తెలుగు, ఆంగ్ల మాద్యమంలో పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు.
ప్రభుత్వ బడులకు మంచి రోజులు
ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మనఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వచ్చాయి. పాఠశాలల్లో అన్నిరకాల వసతులు కల్పించడంతో పాటు ఇంగ్లిషు మీడియాన్ని అమలులోకి తీసుకురావడంతో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
-రమేశ్కుమార్, జిల్లా విద్యాశాఖధికారి
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించా లి. అనుభవజ్ఞులైన, అత్యున్నత అర్హతలు ఉన్న ఉపాధ్యాయుల చే బోధన జరుగుతున్నది. ముఖ్యంగా మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులన్నింటిలో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా లో తొలి విడతలో 441పాఠశాలలను గుర్తించి అభివృద్ధి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దశ ల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతున్నది.
– నాంపల్లి రాజేశ్, సంగారెడ్డి విద్యాశాఖ అధికారి