సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. యాసంగి సీజన్లో 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 97 కేంద్రాల ద్వారా, 2627 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వీటి విలువ రూ.5.15 కోట్లు ఉంటుంది. వారం క్రితం పలుచోట్ల వర్షాలు కురిసి ధాన్యం తడిసినప్పటికీ, రైతులు నష్టపోకుండా వాటిని కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సేకరించిన ధాన్యంలో 2,322 మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు మొదలుకాకపోవడంతో అక్కడ సెంటర్లను ప్రారంభించలేదు. త్వరలోనే ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సంగారెడ్డి, మే 10 (నమస్తే తెలంగాణ): వడ్ల కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి కోతలు ఊపందుకోవడంతో అధికారులు ధాన్యం సేకరణ వేగవంతం చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురిసి అక్కడక్కడ ధాన్యం తడిసింది. ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నారు. యాసంగిలో సంగారెడ్డి జిల్లా 35,262 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు నిరాకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. యాసంగిలో 75వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలను, ఐకేపీ ఆధ్వర్యంలో 77, పీఏసీఎస్ 63, డీసీఎంఎస్ 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 97 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ధాన్యం సేకరణకు 14.15 లక్షల గన్నీబ్యాగులను సిద్ధంగా ఉంచారు. 97 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 2,627 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 1323.96 మెట్రిక్ టన్నుల ధాన్యం, పీఎసీఎస్, డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాల నుంచి 1303.16 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు తెపారు.
‘అందోల్’లో వడివడిగా ధాన్యం కొనుగోళ్లు..
అందోలు, వట్పల్లి, పుల్కల్, చౌటకూర్ మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు వడివడిగా సాగుతున్నాయి. చౌటకూర్, శివ్వంపేట, పుల్కల్ అక్సాన్పల్లి కొనుగోలు కేంద్రాలకు రైతులు ఎక్కువగా ధాన్యం తీసుకువస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది, ఇస్మాయిల్ఖాన్పేటలలో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి. హత్నూర మండలంలోని హత్నూర, దౌల్తాబాద్, చీక్మద్దూరు, కాసాల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతున్నది. పటాన్చెరు మండలంలోని లక్డారం, ముత్తంగి, పటాన్చెరు, నందిగామ, వెలిమల, రామచంద్రాపురం, గుమ్మడిల, జిన్నారంలో వడ్ల సేకరణ ప్రారంభించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
మిల్లులకు చేరుతున్న వడ్లు..
సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2627 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, రైస్ మిల్లులకు 2322 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరవేశారు. ఇంకా 304.36 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు మిల్లులకు చేర్చాల్సి ఉన్నది. ఇప్పటి వరకు జిల్లాలో రైతుల నుంచి రూ.5.15 కోట్ల విలువ చేసే ధాన్యం సేకరించామని, రైతులకు వారి ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు
సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన 97 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతున్నది. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతున్నది. కొన్ని మండలాల్లో వరి కోతలు ప్రారంభం కాలేదు. వరికోతలు ప్రారంభమైన చోట వెంటనే ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నాం. వర్షాలతో ధాన్యంతడిసిన రైతులు ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యం ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తాం.
– శ్రీనివాస్రావు, డీఆర్డీవో