మెదక్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ఈ వానకాలంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి, అందుకనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ, మారెట్ కమి టీ, రైతు ఉత్పత్తి సంఘాల ఆధ్వర్యంలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల ద్వారా 81,500 మంది రైతుల నుంచి రూ.806 కోట్ల విలువైన 3 లక్షల 90 వేల 500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 90 శాతం ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తి చేసి, 72,979 మంది రైతులకు రూ.670 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ తెలిపారు. మిగతా రైతుల ఖాతాలో త్వరలోనే డబ్బులు జమ చేస్తామన్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల తర్వాత అత్యధికంగా ధాన్యం సేకరణ మెదక్ జిల్లాలోనే జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం, సమిష్టి కృషితో అక్టోబర్ 26న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, శరవేగంగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. శనివారం నాటికి నిజాంపేట్లో చివరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు చేసి ప్రక్రియ పూర్తి చేశామన్నారు. కేవలం 40 రోజుల్లోనే 3.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వ్యాపారస్తులు, రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేశారని కలెక్టర్ తెలిపారు. తొందరగా వరి నార్లు విత్తితే ఏప్రిల్ నాటికి పంట దిగుబడి వస్తుందని కలెక్టర్ తెలిపారు. ధాన్యం సేకరణలో సహకరించిన రైస్ మిల్లుల యాజమాన్యానికి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, ప్రతి ఒకరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.