ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో గజ్వేల్ కొత్తరూపు సంతరించుకుంది. గజ్వేల్ చుట్టూ 21.92 కిలోమీటర్ల మేర నిర్మించిన ఔటర్రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పూర్తికావచ్చింది. ప్రభుత్వం రూ.233 కోట్లతో విదేశాల్లో మాదిరిగా అత్యాధునికంగా ఓఆర్ఆర్ నిర్మించింది. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు ఆర్అండ్బీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. ప్రస్తుతం గజ్వేల్ పట్టణం నుంచి రాకపోకలు సాగిస్తున్న భారీ లారీలు, కంటైనర్లు గజ్వేల్ రింగ్రోడ్డు నుంచి హైదరాబాద్, ముంబయి, నాగపూర్, పూణే, నిజామాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు సులభంగా వెళ్లవచ్చు.
Gajwel | సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు గజ్వేల్ ఔటర్ రింగ్రోడ్డు నిర్మించడంతో పట్టణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ పట్టణం చుట్టూ 21.92 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులు చివరి దశకు చేరాయి. భువనగిరి, సూర్యాపేట, చిట్యాల, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి నాగ్పూర్, ముంబయి, పూణే, నిజామాబాద్, సంగారెడ్డిలకు వాహనాలు.. హైదరాబాద్ మీదుగా సరుకు రవాణా చేసే భారీ కంటైనర్లు, పెద్ద లారీలు గజ్వేల్ మీదుగానే వెళ్లడంతో ప్రతి రోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నా యి. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి మీదుగానే హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, భువనగిరి, సంగారెడ్డిలకు భారీ వాహనాలు వెళ్తాయి. ఓఆర్ఆర్తో ఇక భారీ లారీలు, కంటైనర్లు గజ్వేల్ రింగ్రోడ్డు నుంచి నేరుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పడుతుంది. సీఎం కేసీఆర్ దూర దృష్టితో చేపట్టిన ఈ రింగ్రోడ్డు నిర్మాణంతో గజ్వేల్ పట్ణణవాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
రూ.233 కోట్లతో 22 కిలోమీటర్లు…
గజ్వేల్ పట్టణం చుట్టూ రూ.233 కోట్లతో 22 కిలోమీటర్ల ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణ పనులు ఆర్అండ్బీ శాఖ చేపట్టింది. ఇందులో గజ్వేల్ పట్టణం నుంచి రింగ్రోడ్డు వరకు నాలుగు రేడియల్ రోడ్లను అధికారులు పూర్తిచేశారు. అందులో గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన నుంచి పిడిచేడ్ మార్గంలోని కేసరి హనుమాన్ దేవాలయం వరకు, ఎస్సీకాలనీలో కోటమైసమ్మ దేవాలయం నుంచి జాలిగామ వరకు, గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ కమాన్ నుంచి డబుల్ బెడ్రూం ఇండ్ల వరకు, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ నుంచి ధర్మారెడ్డిపల్లి వరకు నాలుగు రేడియల్ రోడ్లను పూర్తిచేశారు. ఈ రోడ్ల పక్కన అవెన్యూ ప్లాంటేషన్లో మొక్కలను పెంచడంతో పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. రేడియల్ రోడ్లు నాలు గు వరుసలుగా మారడంతో గజ్వేల్కు వచ్చే ప్రయాణికులకు ప్రయాణం సులభతరంగా మా రింది. సింగిల్ లేన్తో ఉండే రోడ్లు నేడు నాలుగు వరుసలుగా మారడంతో గజ్వేల్ పట్టణానికి కొత్తకళ వచ్చింది.
ఆరు వరుసలుగా 6.4 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ హైవే…
గజ్వేల్ ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణంలో భాగంగా 22 కిలోమీటర్ల రింగ్రోడ్డులో 6.4 కిలోమీటర్ల మేర రోడ్లు జాతీయ రహదారి తరహాలో అద్భుతంగా ఆరు వరుసలుగా విస్తరించారు. రిమ్మనగూడ నుంచి జగదేవ్పూర్ వెళ్లే మార్గం నుంచి పాతూర్ చౌరస్తా వరకు ఆరు వరుసలుగా రోడ్డు నిర్మాణం పూర్తవడంతో హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ వెళ్లే వాహనాలను ట్రయల్న్ చేపడుతున్నారు. 6.4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణంతో రిమ్మనగూడ వద్ద ఎక్కే ప్రతి వాహనం పాతూర్ సమీపంలోనే రింగ్రోడ్డు దిగే అవకాశం ఉంటుంది. వాహనాలు ఎక్కడా డైవర్షన్ చేసుకునే అవకాశం లేకుండా అద్భుతంగా నిర్మాణం చేపట్టారు. ఈ 6.4 కిలోమీటర్ల రోడ్డును భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆరు వరుసలుగా విస్తరించారు. భవిష్యత్లో జాతీయ రహదారిగా మారితే ఇక ఈ రింగ్రోడ్డు పరిధిలోని ఆరు వరుసల రోడ్డుకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ లెక్కన రింగ్రోడ్డు 6.4 కిలోమీటర్ల పరిధిలో ఆరు వరుసల్లో 150 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపట్టారు. ఈ మార్గంలోనే ఆరు రోటరీ జంక్షన్లను ఏర్పాటు చేసి అందులో హైమాస్ట్లైట్లను అమర్చారు. ఈ ఆరు వరుసల రోడ్డులో 240 స్తంభాలను ఏర్పాటు చేసి 480 బటర్ ఫ్లైలైట్లను డివైడర్ మధ్యలో అమర్చగా.. మూడు వెహికిల్ అండర్ పాస్లు (వీయూపీ) బ్రిడ్జిలు నిర్మించారు.
నాలుగు వరుసలుగా 15.52 కిలోమీటర్లు…
గజ్వేల్ ఔటర్ రింగ్రోడ్డులో భాగంగా 13.92 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు. జాలిగామ-ధర్మారెడ్డిపల్లి గ్రామాల మధ్యన గజ్వేల్ రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వేబ్రిడ్జి పెండింగ్లో ఉండడంతో అక్కడ పనులు ముందుకు సాగడం లేదు. ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో 1.6 కిలోమీటర్ల రింగ్రోడ్డు పనులు పెండింగ్లో ఉన్నాయి. నాలుగు వరుసల రోడ్డు పనులను ఆర్అండ్బీ అధికారులు 100 అడుగుల వెడల్పుతో నిర్మాణం చేపట్టారు. రింగ్రోడ్డు అదనపు హంగులతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది. నాలుగు వరుసల రోడ్డు మధ్యలో బయ్యారం, క్యాసారం గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా రెండు పబ్లిక్ అండర్ పాసెస్(పీయూపీ)లను నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు.
ప్రాంతాలను తెలిపే బోర్డులు…
ఔటర్ రింగ్రోడ్డుపై వాహనదారులు ప్రయాణం చేసే సమయంలో వివిధ ప్రాంతాలు(రూట్స్) తెలియకుండా ఇబ్బంది పడకుండా పాతూర్, జగదేవ్పూర్, రిమ్మనగూడ జంక్షన్ల వద్ద బ్రిడ్జిలకు బోర్డులను ఏర్పాటు చేశారు. జంక్షన్ల వద్ద రింగ్రోడ్డుకు నాలుగు వైపులా బోర్డులు పెట్టారు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ప్రయాణించే మార్గం(రూట్) సులభంగా తెలుస్తుంది. రింగ్రోడ్డు చుట్టూ 22 కిలోమీటర్లలో ప్రధాన జంక్షన్లు, కూడళ్ల వద్ద నేమ్ బోర్డులు ఏర్పాటు చేశారు.
పచ్చదనంతో ఆకట్టుకునేలా 12 జంక్షన్లు…
గజ్వేల్ ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణంలో భాగంగా 12 జంక్షన్లను నిర్మించి అందులో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. అందులో రిమ్మనగూడ నుంచి పాతూర్ వరకు విస్తరించిన 6.4 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే రోడ్డులో ఆరు జంక్షన్లు, ముట్రాజ్పల్లి, సంగాపూర్, కోమటిబండ, ధర్మారెడ్డిపల్లి, జాలిగామ, కేసరి హనుమాన్ దేవాలయం వద్ద జంక్షన్లను నిర్మించి, అందులో విదేశీ జాతి మొక్కలను పెట్టారు. ఒక్కో జంక్షన్ వద్ద 15వేల మొక్కలతో పాటు పచ్చదనంతో కనువిందు చేసేలా గ్రాస్ను ఏర్పాటు చేసి చిన్న మొక్కలు నాటారు. ప్రతిరోజు వాటికి నీళ్లను పోయడంతో పచ్చదనంతో వాహనదారులను ఆకట్టుకుంటున్నది. ఎక్స్ప్రెస్ హైవేపై ఉన్న ఆరు జంక్షన్లను అద్భుతంగా పచ్చదనంతో తీర్చిదిద్దారు. నిత్యం హైదరాబాద్, సిద్దిపేటకు వేలాదిగా వాహనాలు వెళ్తుతుండగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సాఫీగా చేరుకుంటారు. పచ్చదనంతో కనిపించే జంక్షన్లను చూసి ప్రయాణికులు ముగ్ధులవుతున్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా గజ్వేల్ రింగ్రోడ్డుకు ఇరువైపులా సుమారు 8 వేల మొక్కలను నాటారు. ఇందులో గతేడాది నాటిన మొక్క లు ఏపుగా పెరగడంతో రోడ్డుకు కొత్తందం వచ్చింది.
చివరి దశలో రింగ్రోడ్డు పనులు..
గజ్వేల్ రింగ్రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే రింగ్రోడ్డును ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తాం. రైల్వేబ్రిడ్జి వద్ద 1.6 కిలోమీటర్ల రోడ్డు పనులు రైల్వే అధికారులు చేయాల్సి ఉంది. అక్కడ మాత్రమే పెండింగ్లో ఉంది. రోడ్డు నిర్మాణంలో ఎక్స్ప్రెస్ హైవేను ఆరు వరుసలుగా మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నది. గజ్వేల్ రింగ్రోడ్డుతో వాహనదారులకు ప్రయాణం సులభతరం అవుతుంది. ట్రాఫిక్ సమస్యలు ఉండవు.
-రవీందర్రావు, ఈఎన్సీ ఆర్అండ్బీ
విదేశాల్లో ఉన్నట్లు నిర్మించారు..
గజ్వేల్లో ఇప్పటి వరకు ఎంతో అభివృద్ధి జరిగింది. రింగ్రోడ్డుతో గజ్వేల్కే కొత్తందం వచ్చింది. ప్రజ్ఞాపూర్ సమీపంలోని పాతూర్ నుంచి రిమ్మనగూడ వరకు నిర్మించిన బ్రిడ్జిలపై నుంచి వాహనాలు వెళ్తుంటే విదేశాల్లో ప్రయాణం చేస్తున్నామనే అనుభూతి కలుగుతున్నది. రింగ్రోడ్డు పక్కనే ఉన్న సర్కిళ్లు పచ్చని చెట్లతో ఆకట్టుకుంటున్నాయి. గజ్వేల్ అభివృద్ధ్దిలో భాగస్వాములైన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
-శ్రీకాంత్రెడ్డి, గౌరారం
సీఎం కేసీఆర్ కృషితోనే రింగ్రోడ్డు..
గజ్వేల్ చుట్టూ నిర్మించిన రింగ్రోడ్డుతో పట్టణంలోకి వచ్చే భారీ వాహనాలు ఇక రింగ్రోడ్డు మార్గంలోనే వెళ్లే అవకాశం ఉండడంతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో ట్రాఫిక్ సమస్య తీరుతుంది. కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన రింగ్రోడ్డుతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో వాహనాల రద్దీ తగ్గుతుంది. గజ్వేల్ అభివృద్ధి చేసిన కేసీఆర్ను మరిచిపోం. మావద్ద కలలో కూడా ఊహించని అభివృద్ధి జరిగింది.
-పాల రమేశ్గౌడ్, అహ్మదీపూర్