మెదక్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫి యా ఆరోగ్య పరీక్షల పేరుతో ప్రజలను ఇష్టారీతిన దోచుకుంటున్నది. ల్యాబ్లు, ఎక్స్రే, స్కానింగ్ సెంటర్లలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి ధరల పట్టిక ఉండట్లేదు. అనధికారికంగా సెంటర్లు నడిపిస్తూ నిబంధనలు పాటించకుండా రోగుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేస్తున్నప్పటికీ సం బంధిత అధికార యంత్రాంగం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడంపై సర్వ త్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని ఓ దవాఖానలో అనుమతి లేకుండా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో ప్రైవేట్ దవాఖానలు సుమారు 115 వరకు ఉన్నాయి. వీటిల్లో స్కానింగ్ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, ఎక్స్రే సెంటర్లు ఉన్నాయి. డీఎంఎల్టీ, రేడియోలజిస్ట్, ఫార్మాసిస్ట్ కోర్సులు చదవకున్నా కేవలం అనుభవం ఉన్న వారితో ఈ సెంటర్లను నిర్వహిస్తున్నారు. మెడికల్ దుకాణాలు పేరు ఒకరిదైతే మరొకరు నడిపిస్తున్నారు. జనరిక్ పేరుతో అడ్డగోలుగా మందులు అంటగట్టి దోచుకుంటున్నారు. మందులకు బిల్లులు సైతం ఇవ్వడం లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్ నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్లను తీసుకొచ్చి ఎలాంటి అనుమతులు లేకుండా దవాఖానలు ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
జిల్లాలో దవాఖానలు, ల్యాబ్లు, స్కానింగ్, ఎక్స్రే కేంద్రాలు తప్పకుండా వైద్యశాఖ నిబంధనలు పాటించాలి. కేంద్రాల్లో తప్పకుండా ధరల పట్టికను ఏర్పాటు చేయాలి. అర్హులైన వారితో పరీక్షలు చేయించాలి. అధిక ధరలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించకుంటే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.
– డాక్టర్ చందునాయక్, డీఎంహెచ్వో, మెదక్