మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ వెల్దుర్తి/ కొల్చారం/ చేగుంట, జనవరి 20 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం జిల్లా కేంద్రంలోని 18, 22 వార్డుల్లో కొనసాగింది. కంటి సమస్యలు ఉన్నవారు కంటి పరీక్షలు చేయించుకుని కంటి అద్దాలను పొందాలని సూచించారు. కళ్లకు శస్త్ర చికిత్స అవసరం ఉన్నవారిని గుర్తించి శస్త్ర చికిత్స చేయిస్తామని పేర్కొన్నారు.అంధత్వ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పెద్దశంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. పెద్దశంకరంపేటతో పాటు గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సారిక ఉన్నారు.
చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీపీ భాగ్యలక్ష్మి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, వైద్యాధికారి డాక్టర్ సాయిసింధుతో మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ గోపాల్రెడ్డి ఉన్నారు.చిన్నశంకరంపేటతోపాటు సూరారం,భాగీర్థిపల్లి గ్రామాల్లో 446 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 157 మందికి అద్దాలను పంపిణీ చేసి, 67 మందికి చికిత్స అవసరం ఉన్న ట్లు గుర్తించారు. వెల్దుర్తి మండలకేంద్రంతోపాటు మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో పరీక్షలు నిర్వహించారు. వెల్దుర్తిలో 185 మందికి పరీక్షలు నిర్వహించి, 30 మందికి రీడింగ్ అద్దాలు అందించగా, మన్నెవారి జలాల్పూర్లో 148 మం దికి పరీక్షలు నిర్వహించి, 35 మందికి అద్దాలు అందజేశారు.చేగుంట, నార్సింగి మండలాల్లో వైద్యులు రవికుమార్, అనిల్కుమార్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు జరుగుతున్నాయి.