చిలిపిచెడ్/నిజాంపేట/అల్లాదుర్గం/పాపన్నపేట/పెద్దశంకరంపేట, అక్టోబర్ 19: మండలంలోని చిట్కుల్ గ్రామ శివారు మంజీరానది తీరాన వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో ఐదో రోజు గురువారం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనంమిస్తున్నా రు. మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. అలయ ఆవరణలో భక్తులు కొత్త వాహనాలకు పూజలు చేయించుకున్నారు. ఉత్సవాలకు భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నా రు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో నిర్వహించారు.
* దుర్గాదేవి నవరాత్రోత్సవాలు భక్తశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మండలంలోని జగ్గంపేట, అజ్జమర్రి, అంతారంలో దుర్గామాత మండపాల వద్ద మహిళలు గురువారం అమ్మవారికి పట్టు వస్ర్తాలు, గాజులు, ఒడి బియ్యం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. జగ్గంపేట, అజ్జమర్రి గ్రామాల్లో దుర్గాదేవి ఆలయం వద్ద అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
* నిజాంపేటలోని స్థానిక హనుమాన్ ఆలయంలో దుర్గమాత ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు చండీహోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. కార్యక్రమంలో దుర్గమాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సిద్ధిరాంరెడ్డి దంపతులు, కమిటీ సభ్యులు నాగరాజు, తిరుపతి, స్వామి, వెంకటేశం, లక్ష్మణ్, శివ ఉన్నారు.
* అల్లాదుర్గం మండలంలోని రెడ్డిపల్లి, గడిపెద్దాపూర్, అల్లాదుర్గం గ్రామాల్లో గురువారం దేవీ శరన్నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అల్లాదుర్గంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ఐదవ రోజు స్కంధ మాత దేవిగా అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
* ఏడుపాయల వనదుర్గా భవానీమాత గురువారం ఐదవ రోజు స్కంద మాత (మహాలక్ష్మీ) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అలంకరణలో భాగంగా గురువారం అమ్మవారిని నూతన కరెన్సీ(రూపాయల) నోట్లతో అలంకరించా రు. కరెన్సీ అలంకరణ అనంతరం మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏడుపాయల్లో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి కోరారు.
* పెద్దశంకరంపేట పట్టణంతో పాటు మండలంలో ప్రతిష్ఠించిన దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమలాపురంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద గురువారం ఎంపీపీ జంగం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు వేణుగోపాల్గౌడ్, ఆర్యవైశ్య సంఘం యూత్ అధ్యక్షుడు కందుకూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.