మెదక్ అర్బన్, అక్టోబర్ 5 : మెదక్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్లతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని గురువారం మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్ మంత్రి హరీశ్ రావుకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాతగం పలికారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా ఏర్పాటు తర్వాత మెదక్ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదన్నా రు. మెదక్లో విద్యార్థులకు అన్ని హంగులతో గ్రంథాలయం ఏర్పాటు చేశామన్నారు.
ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు గ్రంథాలయంలోని పుస్తకాలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.విద్యార్థులు గ్రంథాలయంలోని పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రంథాలయం లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కౌన్సిలర్లు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయం వద్ద డప్పు చప్పుళ్లతో మంత్రి హరీశ్రావుకు ఘనస్వాగతం పలికారు.