జహీరాబాద్, ఏప్రిల్ 17 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవపూర్ శివారులోని మిషన్ భగీరథ పథకం తాగునీటి సరఫరాను శుక్రవారం సంబంధిత అధికారులు పునరుద్ధ్దరించారు. ఈ నెల 16వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘పొంచి ఉన్న గండం’ అనే కథనానికి సంబంధిత మిషన్ భగీరథ పథకం అధికారులు స్పందించారు. సింగూరు ప్రాజెక్టు అనకట్ట మరమ్మతుల దృష్ట్యా దిగువకు నీటిని వదలడంతో మంజీరానదిలో నీటి మట్టం తగ్గింది.
ఫలితంగా మంజీరానది తీరంలో రాఘవపూర్ గ్రామ శివారులోని ఇన్టెక్వెల్కు నీరు చేరకపోవడంతోపాటు పూడిక నిండిపోవడం వల్ల నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే. ఐదారు రోజులుగా రాఘవపూర్ గ్రామ శివారులోని మిషన్ భగీరథ పథకం ఫిల్టర్ బెడ్ నుంచి న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల పరిధిలోని 74 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితం కావడంతో సంబంధిత జిల్లా అధికారులు స్పందించారు. వెంటనే తగు చర్యలు తీసుకుని మంజీరానది తీరంలోని ఇన్టెక్వెల్ సమీపంలో జేసీబీతో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదిక చేపట్టారు.
మంజీరానదిలో ఉన్న నీటిని ఇన్టెక్వెల్కు చేరేలా కాలువలు తవ్వించి ఆయా మండలాలకు తాగునీటిని పునరుద్ధ్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. తాగునీటి సరఫరా తిరిగి ప్రారంభం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రాయికోడ్ మండలంలోని షాపూర్ మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా చేపడుతున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఆయా మండలాల పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ల్లేలా నమస్తే తెలంగాణ దినపత్రిక చేసిన కృషికి ఆయా మండలాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.