రామాయంపేట, జూన్ 7: వానలకు ధాన్యం తడిసి మొలకెత్తిందని, ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నదాతలు రోడ్డెక్కారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండ లం డి.ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.రామాయంపేట-గజ్వేల్ రహదారిపై గంటపాటు బైఠాయించారు. రెండు నెలలుగా తమ ధాన్యం రోడ్డుపైన, కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని, ఇంతవరకు ధాన్యం తరలించడం లేదని అధికారులపై రైతులు మండిపడ్డారు.
మృగశిక కార్తె వచ్చిందని, మళ్లీ పంట లు వేసుకునే సమయం వచ్చినా చేతికి వచ్చిన ధాన్యం ఇంతవరకు పోలేదని, తాము మళ్లీ వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కొంత మంది రైతుల ధాన్యం తూకం వేశారని, ఇంకా వందల క్వింటాళ్ల ధాన్యం కాంటాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రైతులు ధర్నా విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. రైతులు వినకపోవడంతో తహసీల్దార్ రజినీకుమారితో ఫోన్లో మాట్లాడించారు. అనంతరం అక్కడికి చేరుకున్న డిప్యూటీ తహసీల్దార్తో ఎస్సై బాలరాజు మంతనాలు జరిపి ధాన్యం ఈ రోజే తరలిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.